తెలుగుదేశం సర్కారుపై రాష్ట్ర భాజపా నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం చాలా చేసిందనీ, అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సంతృప్తి లేదన్నట్టుగా భాజపా నేతలు లెక్కలు చెబుతున్నారు. దానికి టీడీపీ నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. అయితే, ఈ గిల్లికజ్జాలు చివరికి టీడీపీ, భాజపాల మధ్య బంధం తెగే వరకూ వెళ్తోందనడంలో సందేహం లేదు! ఆ దిశగా టీడీపీ నేతలకు ప్రజలకు ఇవ్వాల్సిన సంకేతాలు ఒక్కొక్కరిగా ఇచ్చేస్తున్నారు. నిజానికి, ఇలాంటి విమర్శలూ ప్రతివిమర్శలూ వ్యూహ ప్రతివ్యూహాల పర్వంలో కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు స్పందించే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఆయన కల్పించుకున్న దాఖలాలు దాదాపు ఉండవు. కానీ, తాజాగా ఆయన కూడా రాష్ట్ర భాజపా నేతలకు కౌంటర్ ఇచ్చారు. ఎవరిపని వారు చూసుకోవాలన్నట్టుగా వ్యాఖ్యానించారు.
ఎన్డీయే ప్రభుత్వంలో తెలుగుదేశం అక్కడ మైనర్ పార్టనర్ అనీ, రాష్ట్రంలో భాజపా మంత్రులు ఇద్దరున్నారనీ, ఇక్కడ టీడీపీ మేజర్ పార్టనర్ గా ఉందని అశోక్ గజపతి అన్నారు. భాజపా నుంచి రాష్ట్రంలో ఇద్దరు మంత్రులున్నారనీ, టీడీపీ నుంచి కేంద్రంలో ఇద్దరు మంత్రులున్నారన్నారు. ఇక్కడున్నవాళ్లు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తారు, అక్కడున్నవాళ్లు దేశ ప్రయోజనాల కోసం ఆలోచిస్తారు అని చెప్పారు. ‘మీ విజువల్ థింకింగ్ ను దయచేసి ఇక్కడ తీసుకుని రావొద్ద’ని అన్నారు. ఆ తరువాత, ఏం జరుగుతుందో అదే జరుగుతుంది అని ముక్తాయించారు.
రాష్ట్రంలోని భాజపా నేతలు రాష్ట్ర ప్రయోజనాల గురించి పట్టించుకోవడం లేదని అశోక్ గజపతి పరోక్షంగా విమర్శించారు. అంతేకాదు, పొత్తుపై కూడా పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. జరగాల్సింది జరుగుతుందని చెప్పి… జరగబోయేది ఏంటనే సంకేతాలు ఇచ్చారనే అనుకోవాలి. భాజపాతో పొత్తు కొనసాగించడంపై టీడీపీలో కొంత స్పష్టత రానురానూ బహిర్గతం అవుతోందనే అనిపిస్తోంది. ఇన్నాళ్లూ మిత్రధర్మం అంటూ కాస్త వెనకాడిన టీడీపీ నేతలు.. ఇప్పుడు కాస్త ఓపెన్ గానే భాజపాపై తమ భవిష్యత్తు వైఖరి ఇలా ఉండబోతోందనే సంకేతాలు ప్రజలకు ఇచ్చేస్తున్నారు. కేంద్రమంత్రి అశోక్ గజపతి వ్యాఖ్యల్లో కూడా దాదాపు ఇలాంటి అర్థమే ధ్వనిస్తోందని అనిపిస్తోంది.