పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ అనుసరించిన ఒక సరికొత్త రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా రాజకీయ పార్టీలు ఎదైనా ఘటనలో బాధితుల్ని రోడ్డుకు లాగి రాజకీయం చేస్తూంటారు. బీజేపీ కూడా బెంగాల్ లో అదే చేసింది. కానీ అన్ని పార్టీల్లా వదిలేయలేదు. టిక్కెట్లు ఇచ్చింది. బీజేపీ ఆ బాధితులనే నేరుగా ఎన్నికల రణక్షేత్రంలోకి దించి ఒక సాహసోపేతమైన ప్రయోగం చేసింది. విజయవంతం అయింది.
సందేశ్ఖాలీ బాధితురాలు రేఖా పాత్ర, ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటన బాధితురాలి తల్లి రత్న దేబ్నాథ్, వేధింపులకు గురైన పనిమనిషి కలితా మాఝీలకు టిక్కెట్లు కేటాయించడం ద్వారా.. ఆయా వర్గాల్లో ఉన్న అసహనాన్ని, ఆవేదనను రాజకీయ శక్తిగా మార్చడంలో బీజేపీ విజయవంతమైంది. క్షేత్రస్థాయిలో ఇది ఒక శక్తివంతమైన ప్రభావాన్ని చూపింది. బాధితులను కేవలం ప్రచార అస్త్రాలుగా వాడుకుని వదిలేయకుండా, వారికి శాసనసభ లో ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ప్రజల్లో ఒక బలమైన నమ్మకాన్ని కలిగించగలిగారు. వారు ముగ్గురూ గెలిచారు కూడా.
ఇది ఒక రకంగా ప్రత్యర్థి పార్టీ అయిన టీఎంసీపై నైతిక దాడి అని చెప్పవచ్చు, ఎందుకంటే నిందితులకు అండగా నిలిచారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీకి వ్యతిరేకంగా సాక్షాత్తూ బాధితులే బరిలో నిలవడం రాజకీయంగా పెద్ద వ్యూహాత్మక అడుగు. ఇది కేవలం గెలుపోటములకే పరిమితం కాలేదు. అధికారం, అంగబలం ఉన్న వ్యక్తులపై సామాన్యులు గెలవలేరనే భావనను ఈ వ్యూహం పటాపంచలు చేసింది. రేఖా పాత్ర , రత్న దేబ్నాథ్ వంటి వారికి టిక్కెట్లు ఇవ్వడం అంటే.. ఆయా వర్గాల మనోభావాలకు రాజకీయ గుర్తింపునివ్వడమే.
ఈ కొత్త తరహా రాజకీయం వల్ల భవిష్యత్తులో కూడా బాధితులు మౌనంగా ఉండకుండా, తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి రాజకీయాలను ఒక వేదికగా మార్చుకునే అవకాశం ఏర్పడింది. బీజేపీ ఈ ముగ్గురు మహిళలకు టిక్కెట్లు ఇచ్చి వారిని బాధితుల ప్రతినిధులుగా గెలిపించడం ద్వారా, ప్రజాస్వామ్యంలో తిరుగులేని శక్తి సామాన్యుడికే ఉందని నిరూపించిందని అనుకోవచ్చు.


