ఏపీ లిక్కర్ స్కాం విషయంలో ఎవరూ మాట్లాడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశం అయిపోయిన తర్వాత రాజకీయ పరిణామాలపై చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా లిక్కర్ స్కాం ప్రస్తావన వచ్చింది. దర్యాప్తు సంస్థలు లిక్కర్ స్కాం విషయంలో నిష్పక్షిపాతంగా దర్యాప్తు చేస్తున్నాయన్నారు. ఈ విషయంలో రాజకీయ పరమైన వ్యాఖ్యానాలు అవసరం లేదని అందుకే ఈ స్కాం విషయంలో స్పందించవద్దని స్పష్టం చేశారు.
లిక్కర్ స్కాం అంశం దర్యాప్తులో ఎవరూ ఊహించని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ దర్యాప్తులో రాజకీయ ప్రమేయం లేదని.. ఆ బృందంలోని సభ్యలు అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలో రాజకీయం చేయడానికి.. రాజకీయ కక్ష సాధింపుల కోసమే కేసు అన్నట్లుగా కలరింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నేతలు స్పందిస్తే.. వాటిని పెంచుకుంటూ పోయి అదే అభిప్రాయాన్ని కల్పిస్తారు. అందుకే పార్టీ నేతలు ముఖ్యంగా మంత్రులుగా ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారు ఎవరూ మాట్లాడకూడదని చంద్రబాబు సూచించారు.
లిక్కర్ స్కాంలో అంతిమ లబ్దిదారు ఎవరు అన్నదానిపై ఇప్పటికే సాక్ష్యాల సేకరణ పూర్తయిందని చెబుతున్నారు. సరైన సమయం చూసి.. అరెస్టులు ఉంటాయని భావిస్తున్నారు. ఈ విషయంపై స్పష్టతకు రావడంతో వైసీపీ నేతలు.. బెదిరింపులకు దిగుతున్నారు. సోషల్ మీడియాలో బెదిరింపులు ప్రారంభించారు. కానీ పోలీసులు తమ పని తాము చేసుకుపోతారని.. ఆధారాలను బట్టి చర్యలు తీసుకోకుండా ఉండరన్న సంకేతాలు ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నాయి.