సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ తిరిగి సొంత గూటికి చేరిపోవడం దాదాపు ఖాయమనే విషయం తెలిసిందే. పొమ్మనలేక పొగపెట్టిన తెరాసను ఆయన వీడబోతున్నట్టు ఇదివరకే నిర్ణయించుకున్నారు. అయితే, రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీలైనంత త్వరగా చేరిక లాంఛనాన్ని పూర్తి చెయ్యాలని డీఎస్ భావిస్తున్నట్టు సమాచారం. దీన్లో భాగంగానే ఈ మధ్యనే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా డీఎస్ భేటీ అయ్యారు. భేటీలో తన డిమాండ్లను అధిష్టానానికి వినిపించమంటూ డీఎస్ కోరారు. అయితే, వాటిపై హై కమాండ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే అంశమై డీఎస్ వేచి చేస్తున్నట్టు సమాచారం.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో వచ్చేవారంలో డీఎస్ భేటీ అయ్యే అవకాశం ఉందనీ, ఆ తరువాత సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో అధికారికంగా చేరేందుకు డీఎస్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే, హైకమాండ్ ముందుంచిన డీఎస్ డిమాండ్లపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రాహుల్ ని కలుసుకునే సందర్భంలో కూడా వీటినే ప్రధానంగా ప్రస్థావించబోతున్నారని అంటున్నారు. నిజామాబాద్ అర్బన్, రూరల్ సీట్లను తాను సూచించిన వారికి ఇవ్వాలనీ, దీంతోపాటు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తనకు ఎమ్మెల్సీ ఇచ్చి, క్యాబినెట్ లో కీలక మంత్రిత్వ శాఖ బాధ్యతలు కూడా ఇవ్వాలనేది డీఎస్ డిమాండ్ గా తెలుస్తోంది.
ఇప్పుడు పరిస్థితుల్లో రాహుల్ దీనిపై ఎలా స్పందిస్తారనేదే ఆసక్తికరంగా మారింది. వాస్తవం మాట్లాడుకుంటే… ఈ డిమాండ్లపై రాహుల్ ఏమీ తేల్చకపోయినా కాంగ్రెస్ లో చేరాల్సిన అవసరం డీఎస్ ది! కాబట్టి, ప్రస్తుతానికి స్పష్టమైన హామీ లభించకపోవచ్చనే అభిప్రాయమే పార్టీ వర్గాల నుంచి వ్యక్తమౌతోంది. త్వరలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ముందుగా ఆ బాధ్యతలు చూడండీ, తరువాత మీకు తగిన గుర్తింపు ఉంటుందని రాహుల్ సరిపెట్టేసే అవకాశమూ లేకపోలేదు. పైగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో డీఎస్ డిమాండ్లకు తలొగ్గితే… పార్టీలోని ఇతర సీనియర్ల నుంచి మూతి విరుపులు తప్పవు! ఇంకోపక్క, పొత్తుల విషయమై ఎటూ తేల్లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే స్థానాలు ఎన్ని అనేది ఇంకా స్పష్టత రాలేదు. కాబట్టి, డీఎస్ ని పార్టీలో చేర్చుకునే లాంఛనమైతే పూర్తవుతుందిగానీ… ఆయన ఆశిస్తున్నట్టుగా పదవులూ టిక్కెట్లపై హై కమాండ్ నుంచి స్పష్టమైన హామీ అనేది అనుమానంగానే కనిపిస్తోంది. కాంగ్రెస్ లో డీఎస్ చేరడం ఖాయమే… కానీ, పార్టీతో కుదుర్చుకోవాలనుకుంటున్న డీల్ మాత్రం అనుమానంగానే ఉంది..!