అమరావతిలోనూ గూగుల్ క్యాంపస్ రానుంది. విశాఖలో ఇప్పటికే భారీ పెట్టుబడి ప్రకటనలకు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖతో పాటు అమరావతిలోనూ కార్యాలయం నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం 250 ఎకరాలను రెడీ చేశారు. అందులో ఆ సంస్థ కు ఎంత అవసరమో అంత కేటాయిస్తారు. ఆనందపురం వద్ద స్థలాన్ని గూగుల్ ప్రతినిధులు ఇప్పటికే పరిశీలించారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని 2024 డిసెంబరులోనే గూగుల్ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ గ్లోబల్ నెట్వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ బికాశ్ కోలే విశాఖపట్నం వచ్చి అనువైన భూముల కోసం పలు ప్రాంతాలను పరిశీలించారు.
ఇప్పుడు అమరావతిలోనూ గూగుల్ సంస్థ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంది. ఆ సంస్థ ప్రతినిధులు తాజాగా అమరావతిలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. అమరావతిలో ఎలాంటి కార్యాలయం పెడతారన్నదానిపై ఇంకా వివరాలు బయటకు తెలియలేదు. అమరావతిలో ఐటీ రంగ అభివృద్ధికి సంబంధించి, క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఏర్పాటు కోసం టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఐబీఎం వంటి సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి, ఇది 2026 జనవరి నాటికి ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ అమరావతిని అత్యాధునిక సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉంది .
గూగుల్ కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తే అమరావతిలో ఐటీ రంగం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే అమరావతిలో గూగుల్ సంస్థతో సంబంధం ఉన్న AI ఆధారిత ఒప్పందం జరిగింది. గూగుల్ ప్రారంభించబోయే కొత్త ప్రాజెక్టు పనులు అమరావతి క్యాంపస్ నుంచే జరిగే అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతనే దీనిపై క్లారిటీ రానుంది.