పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మొదట బేషరతుగా అంగీకరించి, స్వాగతించింది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆ తరువాత, వాస్తవాలు గమనించి కాస్త గొంతు సవరించుకున్నా, ప్రధానమంత్రి మోడీ నిర్ణయానికి అనుగుణంగానే నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే పనిలోపడ్డారు. క్యాష్ లెస్ ట్రాంజాక్షన్లు పెంచుకోవాలంటూ ప్రజలకు చెబుతున్నారు. క్యాష్ లెస్ను ఎంకరేజ్ చేసేందుకు రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పుకొస్తున్నారు. డ్వాక్రా మహిళకు ఉన్నపళంగా కొత్త స్మార్ట్ఫోన్లు ఇవ్వాలనీ, అందరూ మొబైల్ బ్యాకింగ్ సేవలు అలవాటు చేసుకోవాలని చెప్పారు. అన్ని లావాదేవీలూ ఆన్లైన్లో జరగాలని ఆశిస్తున్నారు. అందుకు ఆదర్శంగా ఎవరికి తీసుకోవాలంటే… మందు బాబుల్ని అని చంద్రబాబు తాజాగా చెప్పడం వినడానికి కాస్త విడ్డూరంగా ఉంది!
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని నెలరోజులు దాటిపోయాయి. దీంతో రాష్ట్రాల ఆదాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్న ఆందోళన మెల్లమెల్లగా బయటకి వస్తోంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి నష్టాల గురించి చూఛాయగా బయటపడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా నష్టాల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు! నోట్ల రద్దు వల్ల అన్ని రకాల వ్యాపారాలూ ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు. చేతిలో పైసలు లేకపోవడం వల్ల ప్రజలు సొంత పనులు మానుకుంటున్నారనీ, చివరికి ప్రయాణాలుకూడా రద్దు చేసుకుంటున్నారని అన్నారు. అన్నింటికీ ఆన్లైన్ లావాదేవీలు ఉన్నాయనీ, పరిష్కారం అక్కడుందని అన్నారు. ఆన్లైన్లో మద్యం విక్రయాలు గణనీయంగా పెరగడం ఆశ్చర్యంగా ఉందని చంద్రబాబు చెప్పారు. మందు బాబులు చేస్తున్నట్టుగానే, ఇతర లావాదేవీలన్నీ నగదు రహితంగా జరగాలని ఆకాంక్షించారు!
ఓ రకంగా చూస్తుంటే.. మందు బాబులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సలహా ఇచ్చినట్టుగా అనిపిస్తోంది కదూ! పెద్ద నోట్ల రద్దు వల్ల మద్యం విక్రయాలు కూడా బాగా తగ్గాయన్న అంచనాలున్నాయి. మద్యం ద్వారా వచ్చే ఆదాయమే ప్రభుత్వానికి ఎక్కువ కదా. కాబట్టి, చేతిలో డబ్బుల్లేవని మందు బాబులు నిరాశ చెందాల్సిన అవసరం లేదనీ, ఆన్లైన్ ద్వారా కొనుకోవచ్చని చంద్రబాబు సలహా ఇస్తున్నట్టుగా ఉందని కొంతమంది విమర్శిస్తున్నారు. అయినా, ఆన్లైన్ విక్రయాలు ఎలా చేసుకోవాలో మందుబాబుల్ని చూసి మిగతావారందరూ నేర్చుకోవాలా…?