రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నారు. కానీ రాజముద్ర కోసం ఓ వ్యక్తి వందల కోట్లను మంచినీళ్లలా ఖర్చు పెట్టాడు. వేలం పాటలో దాన్ని సొంతం చేసుకుని పండగ చేసుకున్నాడు. చైనా అంటే డ్రాగన్. ఈ రాజముద్రపై దొమ్మిది డ్రాగన్ చిత్రాలు చెక్కారు.
18వ శతాబ్దంలో చైనాను పాలించిన క్విన్ లాండ్ అనే రాజుకు చెందిన రాజముద్రను ప్యారిస్ లోని డ్రౌ ఔట్ వేలం శాలలో వేలం వేశారు. ఎన్నో కొన్ని వేల పౌండ్లు రాకపోతాయా అనుకున్నారు. కానీ అశ్చర్యకరంగా వేలం పోటాపోటీగా జరిగింది. చివరకు 17.6 మిలియన్ పౌండ్లకు ఓ చైనా వ్యక్తి సొంతం చేసుకున్నాడు. అంటే మన కరెన్సీలో సుమారు 150 కోట్ల రూపాయలు.
అందమైన నగిషీతో ఆకర్షణీయగా ఉన్న ఈ రాజముద్రను సొంతం చేసుకున్న వ్యక్తి వివరాలు మాత్రం గోప్యం. ఆ వ్యక్తి వివరాలను నిర్వాహకులు ప్రకటించలేదు. 18వ శతాబ్దానికి చెందిన ఈ రాజముద్రను 19వ శతాబ్దంలో ఓ ఫ్రెంచి సంపన్నుడు సొంతం చేసుకున్నాడు. తర్వాత కాలక్రమంలో అది ప్యారిస్ లోని వేలం శాలకు చేరింది.
అందమైన అలనాటి కళాఖండాన్ని సొంతం చేసుకోవడానికి సంపన్నులు పోటీ పడటం మామూలే. అయితే ఈ రాజముద్రకు తాము ఊహించిన దానికంటే 20 రెట్లు ఎక్కువ ధర పలికిందని నిర్వాహకులు ఖుషీ ఖుషీగా చెప్తున్నారు.