నాలాలపై అక్రమనిర్మాణాలను మొత్తం తొలగించాలి. ఒత్తిళ్లకు లొంగ వద్దంటారు మంత్రి కేటీఆర్. అక్రమ నిర్మాణం ఒక్కటీ కనిపించ వద్దని చెప్తారుముఖ్యమంత్రి కేసీఆర్. వాస్తవంలో మాత్రం పేదల పైనే ప్రతాపం చూపిస్తున్న దృశ్యమే కనిపిస్తోంది.
హైదరాబాదులో మూడురోజులుగా జరుగుతున్న కూల్చివేతల్లో పేదల నిర్మాణాలే కనిపిస్తాయి. పెద్దలు, ధనవంతుల నిర్మాణాల జోలికి పోయిన దాఖలాలు కనిపించవు. బుధవారం అయితే మరీ విడ్డూరం. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఓ అక్రమంగా నిర్మించిన ఓ భవనాన్ని కూల్చివేసే పనిని జీహెచ్ ఎం సి వారు మొదలుపెట్టారు. కూల్చివేత జరుగుతుండగానే ఎక్కడినుంచో ఫోన్ వచ్చింది. అంతే, ఆ పని అక్కడే ఆపేశారు. యంత్రాలు సరంజామ తీసుకుని వాపస్ వెళ్లిపోయారు.
అదే బంజారా హిల్స్ లోని రోడ్ నెంబర్ 12లోనూ అంతే. వరసగా ఉన్న అక్రమనిర్మాణాలను కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. వాటికి మార్కింగ్ కూడా చేశారు. జేసీబీలు, ఇతర సరంజామాతో దిగిపోయారు. అయితే కూల్చివేత మాత్రం మొదలుపెట్టలేదు. చాలా సేపు సస్పెన్స్ డ్రామా కొనసాగింది. చివరకు ఏమైందో, ఎవరు అడ్డు వచ్చారో గానీ కూల్చివేత మొదలే కాలేదు. మందీ మార్బలంతో వచ్చిన అధికారులు తుర్రుమని వెళ్లిపోయారు.
హైదరాబాద్ కు వరద ముప్పు రావడానికి ప్రధాన కారణం, నాలాల కబ్జాలు. వాటిపై చేసిన నిర్మాణాలు. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన వాటిని కూల్చే పనిని చేపట్టడం సమంజసం. ఇప్పటికైనా ఈ పని చేయడానికి సాహసించిన ప్రభుత్వాన్ని చాలా మంది మెచ్చుకున్నారు. మరి పెద్దల అక్రమ నిర్మాణాలను కూలుస్తారా లేదా అని కూడా అనుమానించారు. ఆ అనుమానమే నిజమైంది.
గత రెండేళ్లుగా పరిస్థితి గమనిస్తే హైదరాబాదులో ప్రభుత్వం చెప్పినట్టు జరగడం లేదు. ముఖ్యమంత్రి, మంత్రి పదే పదే చెప్పినా గుంతలు పూడ్చడానికీ మీనమేషాలు లెక్కించే యంత్రాంగం ఉంది. అయినా, చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకో వెనుకాడుతోంది. కాబట్టి ప్రతి అక్రమ కట్టడాన్ని కూల్చండని కేసీఆర్ గానీ ఆయన కొడుకు కేటీఆర్ గానీ చెప్పగానే పక్కాగా అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. అంతా ఉత్తుత్తి మాటలేనా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఈ అనుమానంలో నిజం లేదని రుజువు చేయడానికైనా ప్రభుత్వం కఠిన నిర్ణయాన్ని తు చ తప్పకుండా అమలు చేయడానికి సంకల్పిస్తుందేమో చూద్దాం.