ఇంగ్లాండ్తో అయిదు టెస్టుల సిరీస్ను విజయంతో ఆరంభించేందుకు వచ్చిన అద్భుత అవకాశాన్ని టీమ్ఇండియా పాడు చేసుకుంది. విజయం సాధ్యం కాకపోయినా కనీసం మ్యాచ్ను డ్రాగా ముగిస్తుందనుకున్న జట్టు క్షమించరాని తప్పులు చేసి ఓటమి పాలైంది. ఈ టెస్టులో టీమ్ఇండియా లెక్కలేనన్ని తప్పులు చేసింది. టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ తప్పితే.. ఈ మ్యాచ్లో టీమ్ఇండియా ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. మిడిల్ (పంత్ మినహా), లోవర్ ఆర్డర్ దారుణంగా విఫలమయ్యాయి. బౌలింగ్లో పసలేదు. ఫీల్డింగ్ పరమ చెత్త. పట్టు సాధించాల్సిన సమయంలో పట్టుకోల్పోవడం, ప్రత్యర్థిపై ఏ మాత్రం ఒత్తిడి పెంచకపోవడం, క్యాచులు విడిచిపెట్టడం… ఒక్కటి కాదు, క్రికెట్లో చేయరాని తప్పులన్నీ చేసింది.
తొలి ఇన్నింగ్స్లో 600 స్కోరు చేసే అవకాశం ఉన్నా, కేవలం 41 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయి 471 పరుగులకే పరిమితమైంది భారత్. రెండో ఇన్నింగ్స్లో కూడా ఇదే తప్పు చేసింది. ఈసారి 31 పరుగుల తేడాలో 6 వికెట్లు పడ్డాయి. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగానే ఉంది. కాసేపు నిలబడితే పరుగులు వాటంతట అవే వస్తాయి. కానీ మన మిడిల్-లోయర్ ఆటగాళ్లు జీవితంలో తొలిసారి క్రికెట్ బ్యాట్ పట్టుకున్నట్లు పరమ అద్వానంగా ఆడారు. పోనీ ఇంగ్లాండ్ బంతులు సుడిగుండాల్లా వచ్చాయా అంటే అదీ కాదు. సాదాసీదా బంతులే. అందులోనూ మంచి స్కోర్ చేసి ఎలాంటి ఒత్తిడిలేని పొజిషన్లో ఇండియా ఉంది. ఇలాంటి పరిస్థితిలో బౌలర్ కూడా నాలుగు షాట్లు తీయాలి. కానీ అలా జరగలేదు. ఒత్తిపుణ్యానికి వికెట్లు సమర్పించుకున్నారు.
“క్యాచెస్ విన్ మ్యాచెస్” అంటారు. ఇండియా ఓటమికి ప్రధాన కారణాల్లో ఇదొకటి. దాదాపుగా పది క్యాచులు వదిలేశారు. ఒక్క జైస్వాలే నాలుగు క్యాచ్లు వదిలాడు. జైస్వాల్ ఫీల్డ్లో కదిలిన విధానం చూస్తే… ఇతగాడికి బ్యాటింగ్ తప్పితే మరొకటి చేతకాదేమో అనిపించింది. కోచ్, బోర్డు ఈ విషయంలో రివ్యూ చేయాలి. అసలు జైస్వాల్ క్రికెట్ ఆడటానికి ఫిట్గా ఉన్నాడో లేదో తెలుసుకోవాలి. నాలుగు క్యాచులు వదలడం అంటే మాటల కాదు. అతను ఎన్ని సెంచరీలు చేసినా ఉపయోగం లేదు. నిజంగా ఈ విషయంలో రివ్యూ జరగాలి. బంతిని క్యాచ్ చేయడంలో తన టెక్నిక్ని పరిశీలించుకోవాలి. బంతిని క్యాచ్ చేసే సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. క్రికెట్ అంటే కేవలం బ్యాటింగ్ కాదు. కొన్ని సందర్భాల్లో ఒక క్యాచ్ డబుల్ సెంచరీతో సమానం. ఒక క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తుంది. అలాంటి కీలకమైన క్యాచులు జారవిడిస్తే.. ఇలాంటి పరాజయాలే వస్తాయి.
ఈ మ్యాచ్లో బౌలర్ల ప్రదర్శన కూడా అంతంత మాత్రమే. తొలి ఇన్నింగ్స్లో ప్రమాదకరంగా కనిపించిన బుమ్రా… రెండో ఇన్నింగ్స్లో విఫలమయ్యాడు. మిగతా బౌలర్లెవ్వరూ ప్రభావం చూపలేదు. దాదాపుగా ఒక రోజులోనే ఇంగ్లాండ్ 371 పరుగులు ఛేజ్ చేసిందంటే, బౌలింగ్ ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ తప్పులన్నీ సరిదిద్దుకొని రెండో టెస్ట్కు రెడీ అవ్వాలి. ఇదే ఆటతీరు కొనసాగితే మాత్రం ఈ టూర్ టీమ్ఇండియాకు ఓ పీడకలగా మారిపోయే అవకాశం ఉంది.