జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఆ స్థానానికి ఉపఎన్నిక అనివార్యం అయింది. రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు ఆ ఉపఎన్నికపై అంతర్గత కసరత్తు ప్రారంభించాయి. మిగిలిన పార్టీల సంగతేమో కానీ భారత రాష్ట్ర సమితికి ఈ ఎన్నిక అత్యంత క్లిష్టమైనది. ఇది సిట్టింగ్ సీటు మాత్రమే కాదు..సానుభూతి పవనాల్లోనూ గెలవలేకపోతే పార్టీ పునాదులు కదిలిపోయానని అందరికీ తెలిసిపోతుంది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో సిట్టింగ్ సీటులో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయింది. అక్కడ చనిపోయిన ఎమ్మెల్యే సోదరికే చాన్స్ ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. కంచుకోట అనుకునే ఆ స్థానంలో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోవడం ఎవరూ ఊహించనిది. ఇక జూబ్లిహిల్స్ లోనూ అదే పరిస్థితి రిపీట్ అయితే.. గ్రేటర్ ఎన్నికలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే.
గ్రేటర్ లో బీఆర్ఎస్ కు స్వతహాగా బలం లేదు. 2014లో టీడీపీ తరపున గెలిచిన గోపీనాథ్ ను తమ పార్టీలో చేర్చుకున్నారు. మరో రెండు సార్లు ఆ పార్టీ తరపున గోపీనాథ్ గెలిచారు. ఈ రెండు సార్లు మజ్లిస్ మద్దతు కీలకం. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో గెలుపోటముల్ని తేల్చేది ముస్లింలే. మజ్లిస్ అభ్యర్థిని నిలబెట్టకుండా.. లోపాయికారీ ఒప్పందంతో బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచింది. ఈ సారి ఆ పార్టీ కాంగ్రెస్ వైపు ఉంది. జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలతో ముస్లింలు కాంగ్రెస్ వైపు మళ్లుతున్నారు.
బీఆర్ఎస్ క్యాడర్ చాలా వరకూ ఇతర పార్టీలకు వెళ్లిపోయారు. బీఆర్ఎస్ కు బలమైన అభ్యర్థి కూడా లేరు. ఇప్పుడు జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్,బీజేపీ మధ్యనే పోరు సాగితే బీఆర్ఎస్ పని అయిపోయిందని తేలిపోతుంది. అందుకే ఆ పార్టీకి లిట్మస్ టెస్టు. సోషల్మీడియాలో మాత్రమే పని చేసుకునే బీఆర్ఎస్ నేతలు.. ఇప్పటికే సర్వేలు ప్రచారం చేసుకుంటున్నారు. తామే ముందున్నామని చెప్పుకుంటున్నారు. కానీ అసలు అక్కడి రాజకీయ పరిస్థితిపై ఇప్పటికే పార్టీలకు ఓ క్లారిటీ ఉంది.