‘బలగం’ ఫేమ్ వేణు ఇప్పుడు ‘ఎల్లమ్మ’ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. స్క్రిప్టు వర్క్ ఎప్పుడో పూర్తయ్యింది. దేవిశ్రీ ప్రసాద్ ని ఈ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషణ సాగిస్తోంది చిత్రబృందం. ముందు సాయి పల్లవి అనుకొన్నారు. ఆమెకు కథ కూడా వినిపించారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో సాయి పల్లవి కూడా ఆసక్తి చూపించింది. కానీ ఎందుకో కుదర్లేదు. ఆ తరవాత కీర్తి సురేష్ పేరు వినిపించింది. చిత్రబృందం ఆమెతో రెండు మూడు దఫాలు చర్చలు కూడా జరిపింది. కానీ తాను కూడా చేయలేదు.
శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే పేర్లు కూడా పరిశీలించారు. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ అనుకొంటున్నారు. తన ఎంపిక దాదాపు ఖాయమే అని ఇన్ సైడ్ వర్గాల టాక్. `ఎల్లమ్మ`లో కథానాయిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. స్టార్ డమ్ ఉంటూనే, పెర్ఫార్మర్ అయి ఉండాలి. అలాంటి కథానాయిక కావాలి. అందుకోసమే ఇంత కాలం అన్వేషణ జరుగుతూ వచ్చింది. ఇప్పుడు మృణాల్ దగ్గర ఆగింది. ‘సీతారామం’ లాంటి సినిమాల్లో నటిగా తానేంటో నిరూపించుకొంది మృణాల్. ఇటీవల విడుదలైన ‘డెకాయిట్’ లోనూ తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. అందుకే మృణాల్ వైపు చిత్రబృందం మొగ్గు చూపించింది. త్వరలోనే మృణాల్ విషయంలో చిత్రబృందం ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల ఓ ఎనౌన్స్మెంట్ టీజర్ విడుదల చేశారు. కథానాయిక ఫైనల్ అవ్వగానే షూటింగ్ మొదలుపెడతారు.
