ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఏపీకి తుపాను మొంథా గండం పొంచి ఉండటంతో కేంద్రం తరపున పూర్తి స్థాయి సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇవ్వడానికి మోదీ ఫోన్ చేశారు. తుపాన్ సన్నద్ధతలు, కేంద్ర బృందాలు అందిస్తున్న సహకారం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీకి వివరించినట్లుగా తెలుస్తోంది.
తుపాన్ మొంథా ప్రభావం కోస్తాపై తీవ్రంగా ఉండే అవకాశాలుకనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల వర్షాలు ప్రారంభమయ్యాయి. కోస్తాలో మేఘాలు కమ్ముకున్నాయి. మంగళవారం, బుధవారం పరిస్థితి తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉంటుందని భావిస్తున్న ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరింప చేశారు.
తుపాను వచ్చి వెళ్లిపోయాక వీలైనంత వేగంగా కరెంట్, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల్ని అందుబాటులోకి తీసుకు రావడానికి ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. అవసరమైన సరంజామాను రెడీ చేసుకున్నారు. కేంద్రం కూడా ఎలాంటి సాయం అయినా అందించేందుకు సిద్ధంగా ఉండటంతో.. వీలైనంత మేర నష్టం తగ్గించడానికి ప్రభుత్వ యంత్రాంగం శ్రమిస్తోంది.