గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ తర్వాత పత్తా లేకుండా పోయిన శేషన్న ఎక్కడున్నాదనే మిస్టరీ వీడలేదు. నయీం ఏ సెటిల్ మెట్ చేసినా, కుడిభుజం శేషన్నప్రమేయం కచ్చితంగా ఉండేదట. అలాంటి వాడు ఆ గ్యాంగ్ ను మళ్లీ ఏకతాటిపైకి తెచ్చి దందాలు చేయడానికి స్కెచ్ వేస్తున్నాడా? నయీంకు, తనకు మాత్రమే తెలిసిన చోట ఉన్న డంప్ నుంచి భారీగా డబ్బును తీసుకుని ఉడాయించాడా? దేశంలో ఏదో ఒక చోట సెటిల్ కావడానికి ప్రయత్నిస్తున్నాడా? అన్నీ అనుమానాలే. దేనికీ ప్రస్తుతం జవాబు లేదు.
శేషన్న కోసం వేటలో ఓ ముందడుగు వేశామంటున్నారు పోలీసులు. శేషన్న కారు డ్రైవర్ ను, మరొకరిని అరెస్టు చేశారు. హైదరాబాద్ కుషాయి గూడ ప్రాంతంలో వీళ్లను పట్టుకున్నారు. డ్రయివర్ ద్వారా శేషన్న ఆచూకీ దొరకవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఇంటరాగేషన్ ద్వారా శేషన్న అడ్డాల గురించి పోలీసులు తెలుసుకోగలరు. అయితే, ఇంత జరిగిన తర్వాత అతడు పాత అడ్డాల్లోనే ఉంటాడా? కరుడుగట్టిన నేరస్తుడు, మాజీ నక్సలైట్ అయిన శేషన్న అంత అమాయకుడేం కాదు. కాబట్టి, ఎవరికీ తెలియని చోట ఉండి ఉంటాడు. బహుశా భారీగా సొమ్ముతో ఎక్కడో దాక్కుని ఉండొచ్చు.
నల్లమల అడవుల్లో నయీంకు చెందిన డంప్ లో కోట్లాది రూపాయలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. బహుశా దీని గురించి ఆ గ్యాంగులో ఒక్క శేషన్నకు మాత్రమే తెలిసి ఉండొచ్చంటున్నారు. అదే నిజమైతే, నయీం ఎన్ కౌంటర్ తర్వాత ఆ నిధిని తీసుకుని ఎక్కడికో ఉడాయించినా ఆశ్చర్యం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా జరిగే అవకాశాలే ఎక్కువని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. డ్రయివర్ ద్వారా కూడా శేషన్న ఆచూకీ దొరక్కపోతే, ఇక ఇప్పట్లో అతడిని పట్టుకోవడం సాధ్యం కాదేమో అనేది తెలంగాణ పోలీసు వారి అంచనా. చివరికి ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో!