పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్కు వైట్ హౌస్ కు పిలిచి భోజనం పెట్టగానే పాకిస్తాన్ కు ఆయనలో శాంతిదూత కనిపించారు. ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేయండని సిఫారసు చేసేశారు. అదేదో వాళ్ల చేతుల్లో ఉందన్నట్లుగా వాళ్లు సిఫారసు చేయడం.. ట్రంప్ తన కంటే శాంతి కాముకుడు ఈ ప్రపంచంలో ఉండడు అన్నట్లుగా రెచ్చిపోవడం కామెడీగా మారుతోంది.
ట్రంప్ తనకు నోబెల్ ఫ్రైజ్ కావాలని గారాలు పోతున్నారు. యుద్ధాలు ఆపానని స్వయం సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. పాకిస్తాన్ భారత్ కాళ్ల మీద పడితే భారత్ కాల్పుల విరమణకు అంగీకిరంచింది. దాన్ని తన ఖాతాలో వేసుకుని .. అణుయుద్ధం ఆపానని చెప్పుకుంటున్నారు. కానీ భారత్ తీవ్రంగా స్పందించేసరికి..తన ప్రమేయం లేదని ఒప్పుకున్నారు. ఇప్పుడు ఇరాన్ పై దాడి చేస్తున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉన్న పచ్చగడ్డిలో ట్రంపే నిప్పులు పోశారు. ఇప్పుడు తాను స్వయంగా దాడులు చేస్తున్నారు.
అధికారంలోకి రాగానే పుతిన్, జెలెన్స్కీతో మాట్లాడి యుద్ధం ఆపేస్తానని ప్రకటించారు. కానీ ఆయన ఇద్దరితోనూ సున్నం పెట్టుకున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగకపోతే మరింత వినాశనానికి దారి తీస్తోంది. కొత్తగా మధ్యప్రాచ్యంలో వందల ప్రాణాలు పోవడానికి ట్రంప్ కారణమయ్యాడు. ప్రపంచ పెద్దన్నగా అత్యంత సున్నితంగా వ్యవహరించాల్సిన ట్రంప్.. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నారు. తగుదునమ్మా అంటూ నోబెల్ శాంతి బహుమతి కావాలని బెదిరింపులకు దిగుతున్నారు.