ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా అలరించిన వెబ్సిరీస్ ‘పంచాయత్’. గ్రామీణ వాతావరణం, ఊరి సమస్యలు, గ్రామ రాజకీయాలు వంటి అంశాలతో రూపొందిన ఈ సిరీస్ను సహజత్వానికి పెద్దపీట వేస్తూ చాలామందికి ఫేవరెట్గా నిలిచింది. ఇప్పటికే మూడు భాగాలుగా విడుదలై విశేష ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న ఈ సిరీస్లో ఇప్పుడు ‘సీజన్ 4’ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలైంది.
గత మూడు సీజన్లానే సీజన్ 4 కూడా చక్కటి విలేజ్ డ్రామాతో ఆకట్టుకుంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉన్నాయి. చివరి ఎపిసోడ్ మినహాయిస్తే మిగతావి దాదాపు ముప్పై నిమిషాల నిడివిలోపే ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ ఎక్కడా ఇబ్బంది లేకుండా సాగిపోయింది. ఈసారి ఫులేరా గ్రామంలోని ఎన్నికలే ప్రధానంగా సీజన్ తీర్చిదిద్దారు. ప్రధాన్ జీ, భూషణ్ వర్గాల మధ్య నడిచే రాజకీయం ఆసక్తికరంగా సాగింది.
గ్రామ పంచాయతీ కార్యదర్శిగా జితేంద్ర కుమార్, ప్రధాన్ జీగా రఘుబీర్, మంజు దేవిగా నీనా గుప్తా, ప్రహ్లాద్గా ఫైసల్ మాలిక్, వికాస్గా చందన్ రాయ్, రింకీగా సాన్వికా, భూషణ్గా దుర్గేష్ కుమార్, వినోద్గా అశోక్ పాఠక్ మరోసారి తమ సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. ఈ సీజన్లో అశోక్ పాఠక్కి మంచి సీన్లు వచ్చాయి. ఈ సిరీస్లో ప్రత్యేకత ఏమిటంటే ఒక్క ఫ్రేమ్లో కనిపించే నటుడు కూడా చాలా ప్రొఫెషనల్. అలాంటి వారినే ఈ సిరీస్కు తీసుకున్నారు.
పంచాయతీ ఎన్నికలు, రిజల్ట్ను ఆసక్తికరంగా మలిచారు. సిరీస్ చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు ఏదైనా ఒక పక్షం వైపు మొగ్గడం సహజం. కానీ ఈ సిరీస్ చిన్న మ్యాజిక్ చేసింది. ప్రధాన్ జీ వర్గంలో పాజిటివ్ పాత్రలు ఉంటాయి. సహజంగా ప్రేక్షకుడు వీళ్ల వైపే వుండాలి. కానీ దర్శకుడు, రచయిత ఎక్కడో కనిపించకుండా ప్రజాస్వామ్యాన్ని ఓ మెట్టుపైకి ఎక్కించి, జీవితంలో ఒక్కసారి కూడా గెలుపు రుచి తెలియని ఒక పక్షాన్ని గెలిపించడం బాగా కుదిరింది. కౌంటింగ్ జరుగుతున్నప్పుడు వినోద్, మాధవ్ పాత్రలు “అసలు గెలుపు ఎలా వుంటుంది?”, “గెలిస్తే ఎలా అనిపిస్తుంది?” అని ఓ చెట్టు కింద కూర్చొని మాట్లాడతుంటారు. అది చూస్తున్నపుడు ప్రేక్షకుడి మనసూ కరిగిపోతుంది.
మొత్తానికి సీజన్ 4కి మంచి ముగింపే దొరికింది. ప్రధాన్ జీ వర్గం ఇప్పుడు ప్రతిపక్షంలో వుండాలి. గ్రామ పంచాయతీ కార్యదర్శి అభిషేక్ క్యాట్లో మంచి స్కోర్ తెచ్చుకుంటాడు కానీ రింకీతో తన ప్రేమకథ ఇంకా సస్పెన్స్లో వుంది. ప్రహ్లాద్కు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ వచ్చింది. సీజన్ 5లో ఫులేరా గ్రామం మరింత రసవత్తరంగా వుంటుందనే అనుకోవాలి.