ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు కల్యాణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ‘అధీర’ అనే ప్రాజెక్ట్ ఇది వరకే మొదలైంది. ప్రశాంత్ వర్మ ఈ ప్రాజెక్ట్ ని టేకాఫ్ చేశాడు. ‘హనుమాన్’ తరవాత ఈ సినిమానే మొదలవ్వాలి. కానీ ఆ తరవాత ప్రశాంత్ వర్మ ఆలోచనలు మారాయి. ఈ ప్రాజెక్ట్ వేరే దర్శకుడి చేతిలో పెట్టాలని ఫిక్స్ అయ్యారు. అప్పటి నుంచీ తగిన దర్శకుడి కోసం అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు.
‘నా సామిరంగ’ ఫేమ్ బిన్నీ ని ఈ ప్రాజెక్ట్ లోకి లాక్కొచ్చారు. కొంత మేర ఆయన ట్రావెల్ అయ్యారు. అయితే ఆ తరవాత ఆయన కూడా తప్పుకొన్నారు. ఇప్పుడు శరణ్ కొప్పిశెట్టిని దర్శకుడిగా తీసుకొన్నట్టు తెలుస్తోంది. ‘తిమ్మరుసు’ చిత్రానికి దర్శకత్వం వహించారీయన. చాలా కాలం నుంచి ప్రశాంత్ వర్మతో కలిసి పని చేస్తున్నారు. ఇప్పుడు ‘అధీర’ చిత్ర బాధ్యతలు ఈయన చేతిలో పెట్టినట్టు సమాచారం.
ఈ ప్రాజెక్ట్ కాస్త భారీగానే డిజైన్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పేరున్న నటీనటులు ఈ సినిమాలో పని చేయబోతున్నారు. ఓ పాత్ర కోసం మోహన్ లాల్ ని అనుకొంటున్నారని తెలుస్తోంది. తెలుగు నుంచి ఓ సీనియర్ హీరోని కూడా సంప్రదిస్తున్నారు. ఇద్దరిలో ఎవరు ఓకే అయినా ఈ ప్రాజెక్ట్ కి క్రేజ్ రావడం ఖాయం. మరోవైపు బాలీవుడ్ నుంచి ఓ సీరియర్ నటుడ్ని రంగంలోకి దింపడానికి ప్రయత్నిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత కాబట్టి… ఖర్చుని వెనకాడే ప్రసక్తే ఉండదు. ఎవరు కావాలన్నా వెంటనే రంగంలోకి దింపేస్తారు. అందుకే కాస్టింగ్ విషయంలో ప్రశాంత్ వర్మ రాజీ పడడం లేదు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.