ప్రొ.నాగేశ్వర్ : అమరావతి బాండ్లపై రచ్చ ఎందుకు…?

అమరావతి బాండ్లపై ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. చాలా మంది…చంద్రబాబును చూసి.. చంద్రబాబు బ్రాండ్ ను చూసి బాండ్లు కొన్నారని ప్రచారం చేస్తున్నారు. మరికొంత మంది ఎక్కువ వడ్డీ అంటూ విమర్శలు చేస్తున్నారు. కానీ.. ఏ ఒక్క ముఖ్యమంత్రిని చూసి బాండ్లు కొనరు. ఎందుకంటే… ఏ సీఎం కూడా శాశ్వతంగా పదవిలో ఉండరు. ఇలా ఉంటారని ఏ ఇన్వెస్టరూ అనుకోడు.పెట్టుబడిదారుడు ఎప్పుడైనా… ఆంధ్రప్రదేశ్ ప్రజలను చూసి.. ఆంధ్రప్రదేశ్ సంపదను చూసి.. ఇన్వెస్ట్ చేస్తారు. ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంటే… పెట్టుబడిదారులు మరింతగా ఆకర్షితులవుతారేమో కానీ.. కేవలం ఒక్క ముఖ్యమంత్రిని చూసి వారు పెట్టబుడి పెట్టరు.

రాజధాని పేరుతో పొలిటికల్ గేమ్..?

బాండ్లు… సంగతి పక్కన పెడితే.. అమరావతి అనే కాన్సెప్ట్ లో.. కొన్ని ప్రశ్నలు చాలా కాలంగా ఉన్నాయి. హైదరాబాద్ ను మించిన రాజధాని, ఢిల్లీనీ తలదన్నేలా రాజధాని కడతామని… ఓ రాజకీయ వ్యూహాన్ని అమలు చేశార. ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంల సీమాంధ్ర ప్రజల సెంటిమెంట్ ప్రధానంగా హైదరాబద్ పైనే ఉంది. గతంలో ప్రత్యేక ఆంధ్ర కోరుకున్నవారు కూడా ఇప్పుడు సమైక్యాంధ్ర కోరుకున్నారు. దానికి కారణం హైదరాబాద్. ఉమ్మడి రాష్ట్రంలోని అందరి ప్రజల భాగస్వామ్యంలో హైదరాబాద్ అభివృద్ది చెందింది. అందుకే హైదరాబాద్ ను కోల్పోతున్నామనే భావన సీమాంధ్రుల్లో పెరిగింది. ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో.. అప్పుడు సమర్థవంతంగా…రాజధాని కేంద్రంగా రాజకీయ వ్యూహం అమలు చేశారు. 400 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరం ఏర్పడింది. కానీ చంద్రబాబు నాలుగేళ్లు, ఐదేళ్లలో ఓ మహా నగరాన్ని నిర్మిస్తామని చెప్పడం సాధ్యం కాదు.

రూ. 10 వేల కోట్లు అమరావతి కి సరిపోతాయా..?

చంద్రబాబు అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రావాలి. విభజన చట్టంలో కొత్త రాజధానికి నిధులివ్వాలని స్పష్టంగా ఉంది. కానీ ఇవ్వడం లేదు. అలాంటి సమయంలో ఒక్క రూపాయు ఖర్చు లేకుండా అమరావతి నిర్మాణం చూడండి అని సవాల్ చేశారు. భూసమీకరణ చేశారు. డెవలపర్ కాన్సెప్ట్ తో దీన్నిసిద్ధం చేశారు. అమలు చేస్తున్నారు. ఇన్ని అయిన తర్వాత మళ్లీ బాండ్లు ఎందుకు..?. రూ. 1300 కోట్ల విలువైన బాండ్లు ఇష్యూ చేస్తే రూ. 2 వేల కోట్లు వచ్చాయి. కానీ ఇవి రాజధాని నిర్మాణానికి ఎంత ఉపయోగపడతాయి..? గతంలో… బ్రిక్స్ కొనమని.. చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆ ఇటుకలతో అమరావతి కట్టరు. కానీ రాజధాని చుట్టూ ఓ భావోద్వేగ పూరిత వాతావరణాన్ని కల్పించారు. ఇప్పుడు బాండ్లతో అదే చేస్తున్నారు. చంద్రబాబు గతంలో రాజధాని నిర్మించాలంటే.. రూ. 4 లక్షల కోట్లు అవసరం అవుతాయన్నారు. ఇప్పుడు బాండ్ల రూపంలో సేకరించాలనుకుంటున్న రూ. 10 వేల కోట్ల ఎలా సరిపోతాయి..?

భారీ వడ్డీ లు ఎందుకు..?

ఇక బాండ్ల వడ్డీ రేటు కూడా ముఖ్యం. జీహెచ్ఎంసీ ఎనిమిది శాతం, పుణె మున్సిపల్ కార్పొరేష్ 7.2 పర్సంట్ వడ్డీకి బాండ్లు జారీ చేసింది. కానీ అమరావతి బాండ్లకు మాత్రం 10.3శాతం వడ్డీ ఇస్తున్నారు. కానీ ఇతర ఏజన్సీల దగ్గర ఇంత కంటే తక్కువకే రుణాలు లభిస్తున్నాయి. ఈ వడ్డీ భారం ఎవరు భరిస్తారు. ఏపీ ఆర్థిక పరిస్థితి ఏమీబాగోలేదని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నారు. రెవిన్యూలోటు, రుణాలుఎక్కువగా ఉన్న రాష్ట్రం ఎలా భరిస్తుంది. అంటే ప్రజలపై భారం వేసినట్లే. అప్పు తేవడం తప్పు కాదు. అప్పు చేసి ఏం చేస్తారు..?. అప్పు చేసి… ఆదాయం రాని కోసం ఖర్చుచేస్తే… ఆ అప్పు ఎలా తీరుస్తారో కూడా ప్రభుత్వం చెప్పాలి. ఇవాళ పది వేల కోట్ల అమరావతి రుణానికి దాదాపుగా రూ. వెయ్యి కోట్ల రూపాయలు వడ్డీ పోతుంది. దీన్నిఎలా భరిస్తాడు. సీఆర్డీఏతో అప్పు చేయించి.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గ్యారటీర్ గా ఉండాల్సి వస్తోంది…?. రాజధానిలో నిర్మాణాల వల్ల… ప్రభుత్వానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. ఆదాయం రాదు. మరి అప్పులు ఎలా తెస్తారు..?

హైదరాబాద్ లో ఒకేచోట అభివృద్ది జరిగిందని సీమాంధ్ర నేతలు చెబుతూంటరు. నిజానికి ఉమ్మడి ఏపీలో …అందరూ సీమాంధ్ర ముఖ్యమత్రులే. వారందరూ… హైదరాబాద్ ను ఎందుకు అభివృద్ధి చేశారు..? అలాంటి తప్పే మళ్లీ ఎందుకు జరుగుతోంది..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.