ప్రొ.నాగేశ్వర్: ట్రంప్ బెదిరింపులకు తలొగ్గుతున్న మోడీ..?

ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించిందని .. ఆ దేశం నుంచి ఏమీ కొనవద్దని ప్రపంచదేశాలకు డొనాల్డ్ ట్రంప్.. ఓ రకంగా ఆదేశాలు జారీ చేశారు. దానికి భారత్ కొంత వెసులుబాటు ఉంటుందని ఆశించింది. ఎందుకంటే.. అమెరికాలో భారత్ ఇటీవల సంబంధాలు బాగా పెంచుకుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం.. ఇరాన్‌ నుంచి ఏమి కొన్నా…భారత్ పై ఆంక్షలు విధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. అంటే.. అమెరికాకు శత్రువు అయిన ఇరాన్‌తో భారత్ ఎలాంటి వాణిక్య కార్యకలాపాలు నిర్వహించకూడదు.

ఇరాన్ విషయంలో భారత్‌ను బెదిరిస్తున్న ట్రంప్..!
భారత్‌కు సంబంధించినంత వరకు.. ఇరాన్‌ ఓ కీలక వాణిజ్య భాగస్వామి. ఎందుకంటే.. భారత పెట్రోలియం ఉత్పత్తుల్లో దాదాపుగా ఎనభై శాతం దిగుమతులే. మనం ఈ ఉత్పత్తుల్లో అత్యధికంగా ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకుంటాం. సౌదీ అరేబియా, ఇరాక్ తర్వాతి స్థానాల్లో ఉంటాయి. ఈ మూడు దేశాల నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకుంటోంది. ఈ మూడు దేశాలతో పోలిస్తే.. ఇరాన్ నుంచి ఎక్కువ చమురు ఎగుమతి అవుతుంది. ఎందుకంటే.. ఆ దేశం నుంచి కాస్తంత చవకగా.. ఉంటుంది. ఎందుకంటే… వారు ఆంక్షలు ఎదుర్కొంటున్నారు కాబట్టి.. తక్కువగానే ఇస్తున్నారు. అలాగే.. ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఇరాన్‌ నుంచి కొనుగోలు చేసే చమురుకు.. భారత్ రూపాయల్లోనే చెల్లిస్తుంది. దీని వల్ల ఇరాన్.. ఆ సొమ్ముతో భారత్ నుంచే కొనుగోళ్లు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే.. ఇరాన్ నుంచి మనం చమురు కోనుగోలు చేయడం చీప్ అండ్ బెటర్. కానీ అమెరికా ఏం చెబుతోందంటే.. మేం ఆంక్షలు విధించాం కాబట్టి.. మీరు కూడా విధించాలని భారత్‌ను దాదాపుగా బెదిరిస్తోంది.

ఇరాన్‌పై ఆంక్షలు విధించడానికి అమెరికా ఎవరు..?
గతంలో ఇరాన్‌ అణుకార్యక్రమాలను పరిమితం చేసేలా… అమెరికాతో ఒప్పందం చేసుకుంది. హఠాత్తుగా… ట్రంప్ ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అంటే.. తాము కుదుర్చుకున్న ఒప్పందం నుంచి బయటకు వచ్చి.. ఇరాన్‌పై ఆంక్షలు విధించేశారు. మొదటి ప్రశ్న.. అసలు అమెరికా ఎవరు.. ఈ ఆంక్షలు విధించడానికి..?. అంతర్జాతీయ చట్టాలను.. ఉల్లంఘిస్తే.. ఇరాన్‌పై ఆంక్షలు విధించాల్సింది ఐక్యరాజ్యసమితి. రెండోది.. ఓ సర్వసత్తాక దేశమైన భారత్.. ఏ దేశంతో వాణిజ్య సంబంధాలు నిర్వహించాలో.. అమెరికా ఎలా నిర్ణయిస్తుంది..?. భారత్‌ కూడా.. పాకిస్థాన్ అతి పెద్ద ఉగ్రవాద దేశం అని.. ఆ దేశంతో.. ఎలాంటి వ్యాపార సంబంధాలు పెట్టుకోవద్దని చెబుతుంది. అమెరికా పాటిస్తుందా..?.

పాకిస్థాన్ విషయంలో ట్రంప్ అలాగే వ్యవహరిస్తారా..?
అమెరికాకు పాకిస్థాన్… ఓ పెద్ద మిత్రదేశం. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎగుమితి చేస్తోందని… మతోన్మాద దేశం అందుకుని… ఆ దేశంతో సంబంధాలు తెంపుకోవాలని.. భారత్ డిమాండ్ చేస్తే..ట్రంప్ అంగీకరిస్తాడా..? ఏ దేశంలో వాణిజ్యసంబంధాలు.. లాభదాయకమైతే.. ఆ దేశంతో వాణిజ్యం చేసుకుంటారు. భారత్ కూడా అంతే. కానీ దురదృష్టవశాత్తూ.. నరేంద్రమోడీ ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి తలొగ్గుతోంది. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు తెంచుకునే ప్రయత్నం చేస్తోంది. గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా అదే చేసింది. ఇరాన్ ఇష్యూలో అమెరికాకే మద్దతు తెలిపింది. ఇలాంటి విషయాల్లో తటస్థంగా ఉండాల్సిన భారతదేశం.. అప్పట్లో.. అమెరికాకు సపోర్ట్ చేసింది. వాణిజ్యాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించింది. అదే బాటలో మోడీ ప్రభుత్వం కూడా నడుస్తోంది.

దేశ నిర్ణయాత్మక శక్తిని ట్రంప్‌కు మోడీ తాకట్టు పెడుతున్నారా..?
అప్పట్లో.. వాణిజ్య సంబంధాలను పరిమితం చేసుకోవాలని… ఒత్తిడి చేసిన అమెరికా.. మరో అడుగు ముందుకు.. వేసి. ఏ రకమైన వాణిజ్య సంబంధాలు పెట్టుకోవద్దని డిమాండ్ చేస్తోంది. మీరేమైనా సంబంధాలు పెట్టుకుంటే మీపైన కూడా.. ఆంక్షలు విధిస్తామని హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి వచ్చింది. భారత్‌ స్వేచ్ఛకు, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితికి.. అమెరికాతో నిర్మించుకున్న స్నేహానికి కూడా.. పరీక్షగా నిలిచే పరిస్థితి ఏర్పడింది. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కొనసాగించాలా లేదా అన్నది భారత్ నిర్ణయించుకుంటుంది.. హెచ్చరించడానికి అమెరికా ఎవరు..?. భారతదేశానికి ప్రత్యేకమైన విదేశాంగ విధానం ఉంది. దాన్ని ఏళ్లుగా ఫాలో అవుతున్నాం. అది కాదని.. అమెరికా చెప్పిందని… ఇరాన్‌తో గొడవ పెట్టుకుంటామా..?. రేపు అమెరికా.. పాకిస్థాన్ మా మిత్రదేశం.. ఆ దేశాన్ని ఏమీ అనవద్దని అంటే.. ఊరుకుంటారా..?. అలాగే రేపు అమెరికా.. మరో దేశంతో గొడవ పెట్టుకుంటే…ఆ దేశంతో కూడా సంబంధాలు వదిలేద్దామా..?. అంటే.. అమెరికాతో శత్రుత్వం పెట్టుకున్న దేశాలన్నింటితోనూ.. భారత్ శత్రుత్వం పెట్టుకోవాలా..? ఇదే పద్దతిని భారత్.. విషయంలో.. అమెరికా ఎందుకు పాటించదు..?.

పాకిస్థాన్‌పై ఆంక్షలు విధించమని భారత్‌ డిమాండ్ చేయదా..?
అమెరికా పాకిస్థాన్ విషయంలో ఎందుకంత.. మెత్తగా ఉంటోంది. ఆ దేశం.. అణుసామర్థ్యాన్ని బెదిరింపులకు ఉపయోగిస్తోంది. ఆ దేశం వద్ద ఉన్న అణుపరిజ్ఞానం టెర్రరిస్టులకు అందడేస్తుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో అతి పెద్ద ఉగ్రవాద దేశం పాకిస్థాన్. పాకిస్థాన్ లో ఉగ్రవాదాన్ని అణిచి వేయాలనుకుంటే.. అమెరికాకు ఒక్క రోజులో పని. ఎందుకంటే.. పాకిస్థాన్ మిలటరీ కూడా.. అమెరికా కనుసన్నల్లోనే పని చేస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ టెర్రర్ ఎటాక్ జరిగినా… పాకిస్థాన్ ఉగ్రవాదుల హస్తం ఉంటుంది. అయినా అమెరికా ఎందుకు పాకిస్థాన్ పై ఆంక్షలు విధించదు. హఫీజ్ సయీద్ లాంటి టెర్రరిస్టులు… దావూద్ ఇబ్రహీం లాంటి నేరగాళ్లు.. పాకిస్థాన్ గడ్డపై నివసిస్తున్నారు. అయినా అమెరికా పాకిస్తాన్ పై ఎందుకు ఆంక్షలు విధించదు..? చర్యలు తీసుకోదు..?

అమెరికా చెప్పినట్లు చేస్తే..భారత్ ఎప్పటికీ గ్లోబర్ పవర్ కాదు..!
ఈ విషయాన్ని భారత్ ప్రపంచం దృష్టికి తీసుకు వెళ్లాలి. అమెరికా ద్వంద్వ ప్రమాణాల్ని నిలదీయాలి. పాకిస్తాన్‌పై ఆంక్షలు విధించేలా… ఆ దేశంలో ఉగ్రవాదాన్ని అంతం చేసేలా ఒత్తిడి చేయాలి. అప్పుడే భారతదేశం గ్లోబల్ లీడర్ అవుతుంది. అమెరికా హెచ్చరించినప్పుడల్లా… భయపడిపోయి… ఏ దేశంతో స్నేహం చేయమంటే.. ఆ దేశంతో స్నేహం చేసి.. ఏ దేశంతో వాణిజ్యసంబంధాలు తెంచుకోమంటే.. దానికీ తలూపితే.. అది మంచిది కాదు. అలా ఉన్నంత కాలం.. ఇండియా గ్లోబల్ పవర్ కాదు. అమెరికాతో స్నేహం ఉండాలి. అదే సమయంలో ఇరాన్‌తో కూడా… స్నేహం ఉండాలి. అంతే కానీ.. అక్కడ డొనాల్డ్ ట్రంప్‌కు తుమ్ములు వస్తే మనం తుమ్మాలనుకోవడం కరెక్ట్ కాదు. వాళ్లకు కోపం వస్తే..మనం ప్రతీకారం తీర్చుకోవడం కూడా కరెక్ట్ కాదు. దీనిపై అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.