తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ప్రకటించింది. ఆ అవార్డుల విషయంలో ఇండస్ట్రీ పెద్దలు ఎంత టెక్కు చూపారో..ఎలాంటి పరిస్థితుల్లో వారు దిగి వచ్చారో అందరికీ తెలుసు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా నంది అవార్డులు ఇవ్వాలి అని పెద్ద మనిషి నారాయణమూర్తి ప్రెస్మీట్లో విజ్ఞప్తి చేశారు. ఆయనకు గతంలో జరిగింది గుర్తు ఉందో లేదో కానీ.. అప్పుడు జరిగిన పరిణామాలను గుర్తు చేసి.. తప్పు ఇండస్ట్రీ వైపు నుంచి జరిగిందని.. మరోసారి అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పి ఉంటే.. కాస్త హుందాగా ఉండేది.
రాష్ట్రం విడిపోయాక ఏ రాష్ట్రం కూడా అవార్డులు ఇవ్వాలన్న ఆలోచన చేయలేదు. మొదటి సారి టీడీపీ ప్రభుత్వం మూడేళ్లకు అవార్డులు ఇవ్వాలని సంకల్పించింది. సినీ పరిశ్రమ వారితోనే కమిటీల్ని ఏర్పాటు చేసింది. వారే అవార్డుల్ని నిర్ణయించింది. ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ అవార్డులకు కులం అంటగట్టారు. తమ ఇండస్ట్రీపై తాము నిప్పులు పోసుకున్నారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో రాజకీయం చేసి ప్రభుత్వంపై కుల ముద్ర వేసే ప్రయత్నం చేశారు. బన్నీ వాసు అనే నిర్మాత దగ్గర నుంచి పోసాని అనే బూతు సామ్రాట్ వరకూ అందరిదీ అదే దారి.
అప్పుడే ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీ అంటే అసహ్యం వేసి ఉంటుంది. ప్రకటించిన అవార్డులను కనీసం ప్రదానం కూడా చేయలేదు. మళ్లీ ప్రకటించలేదు. వారి కుల ముద్ర కుట్రలు ఫలించి ప్రబుత్వం మారింది. ఐదేళ్లు.. ప్రభుత్వం కాళ్ల దగ్గర పడి ఉండాల్సి వచ్చింది. చిరంజీవి వంటి పెద్ద మనిషి వెళ్లి దండాలు పెట్టుకుని ఇండస్ట్రీని కాపాడుకోవాలని అడగాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మారినా… కనీసం మర్యాదపూర్వకగా కూడా కలవలేదు. కానీ ఇప్పుడు మళ్లీ అవార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెరపైకి వస్తున్నారు. గతంలో అవార్డులు ప్రకటించడం వల్ల తమపై జరిగిన కులదాడిని .. ఏ రాజకీయం అయినా మర్చిపోతుందా?. టీడీపీ ప్రభుత్వం మరోసారి అలాంటి పని చేస్తుందని ఎవరూ అనుకోరు. ఇదంతా టాలీవుడ్ లోని వ్యక్తులు చేసుకున్న స్వయంకృతమే. దానికి ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత మరోసారి అలాంటి తప్పులు చేయబోమని ప్రభుత్వానికి నమ్మకం కలిగిస్తే ఆలోచిస్తారేమో ?