‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ఈమధ్యే సెట్స్ పైకి వెళ్లింది. టీమ్ అంతా సేమ్ టూ సేమ్. ఒకట్రెండు చిన్న చిన్న మార్పులు తప్ప. అయితే.. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ చేయాల్సింది. కానీ.. నిర్మాత సృజన్ చేతికి వెళ్లింది. వాస్తవానికి ఓ సినిమా హిట్టయినప్పుడు సీక్వెల్ కి సంబంధించిన హక్కుల్నీ నిర్మాణ సంస్థ చేతుల్లోనే ఉంటాయి. కానీ.. ఈ సీక్వెల్ మాత్రం కొత్త బ్యానర్కి వెళ్లింది. అందుకు గానూ.. సీక్వెల్ రాయల్టీ కింద దాదాపు రూ.2 కోట్లు ఇవ్వాల్సివచ్చిందని ఇన్ సైడ్ వర్గాల టాక్. టైటిల్ కే ఇంత ఖర్చు పెట్టిన సినిమా ఈమధ్య కాలంలో ఇదేనేమో.
నిజానికి ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాని సురేష్ బాబు, సృజన్ సంయుక్తంగా నిర్మించాల్సింది. కానీ బడ్జెట్ లెక్కల దగ్గర అసలైన పేచీ వచ్చింది. ఈ సినిమా కోసం సృజన్ వేసిన బడ్జెట్ రూ.35 కోట్లు. అంతలో ఈ సినిమా తీస్తే వర్కవుట్ అవ్వదన్నది సురేష్ బాబు భయం. విశ్వక్సేన్ కే రూ.5 కోట్ల పారితోషికం ఇవ్వాల్సివచ్చింది. తరుణ్ భాస్కర్కి సైతం మంచి రెమ్యునరేషనే ఇవ్వాలి. ఓ దశలో వీరిద్దరినీ పక్కన పెట్టి పూర్తిగా కొత్తవాళ్లతో సీక్వెల్ చేయాలన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ అది సాధ్యం కాదని అర్థమైంది. అందుకే ఈ సినిమా నిర్మాణంలో ఆయన వెనుకడుగు వేశారు. సురేష్ బాబు దగ్గర్నుంచి సీక్వెల్ రైట్స్ తీసుకోవడానికి నిర్మాత సృజన్ రూ.2 కోట్లు వెచ్చించారు. అసలు ‘ఈ నగరానికి ఏమైంది 2’ అని కాకుండా వేరే టైటిల్ పెట్టుకొని ఈ సినిమా చేసుంటే.. ఆ రెండు కోట్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే.. ‘ఈ.న.ఏ’ సినిమాకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ టైటిల్ వాడుకొంటే ఓటీటీ రైట్స్ రూపంలోనూ మంచి డబ్బులు వస్తాయి. అందుకే.. సీక్వెల్ రూపేణ డబ్బులు ఇవ్వాల్సివచ్చింది.