స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తాం.. లక్షకు లక్ష వస్తాయి అని ఆశ పెడితే పోలోమంటూ వందల మంది పెట్టుబడి పెట్టారు.దాదాపుగా రూ.150 కోట్లు వసూలు చేసిన ఆ ట్రేడింగ్ మోసగాళ్లు రాత్రికి రాత్రి జెండా ఎత్తేశారు. ఈ మోసం హైదరాబాద్లోని జీడిమెట్ల పరిధిలో మధ్యతరగతి ప్రజలు నివాసం ఉండే కాలనీలో జరిగింది. ఓ చిన్న కాలనీని టార్గెట్ చేసుకుని చేసిన మోసంలోనే 150 కోట్లు దోచుకెళ్లిపోయారు. ఇక దేశంలో ఎన్ని ఇలాంటి మోసాలు జరుగుతున్నాయో చెప్పడం కష్టం. ఈ స్కామ్స్ పరిధి వేల కోట్లలోనే ఉంటుంది.
ట్రేడింగ్ పేరుతో విస్తృతంగా ప్రచారం
ప్రతి ఒక్కరి వాట్సాప్ కు.. ఇప్పుడు ట్రేడింగ్ గ్రూపులు తయారయ్యాయి. అవసరం లేకపోయినా.. ఆసక్తి చూపకపోయినా.. ఉచిత ట్రేడింగ్ చిట్కాలంటూ వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేస్తున్నారు. ఆ మాయలో పడి చివరికి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మల్టీ బ్యాగర్ స్టాక్స్ అని.. రోజువారీ ట్రేడింగ్ లాభాలు అని ఆశ చూపి వారి సొమ్ము కాజేస్తున్నారు. మొదట్లో చిన్న మొత్తాల్లో లాభాలు ఇచ్చి భారీగా వసూలు చేశాక జెండా ఎత్తేస్తున్నారు. ఈ తరహా మోసాలు పెరిగిపోవడంతో పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
స్టాక్ మార్కెట్ లాభాలపై విస్తృత ప్రచారం
భారత స్టాక్ మార్కెట్ కొంత కాలంగా దూసుకెళ్తోంది. అప్పుడప్పుడూ ఒడిదుకుడుకులు చూసినా అంతిమంగా భారీ లాభాలను చూస్తోంది. పైగా అదే సమయంలో షేర్లు కొనడం, అమ్మడం వంటివి చేయడం చాలా ఈడీ అయిపోయింది. బ్యాంక్ అకౌంట్ల మాదిరిగా డీమ్యాట్ అకౌంట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో అదో జూదంలా కొంత మంది ప్రారంభిస్తున్నారు. చివరికి సర్వం కోల్పోతున్నారు. అలా కోల్పోయేది కాకుండా మోసాల బారిన పడుతున్నారు.
స్టాక్ మార్కెట్ పై పూర్తి అవకాహన ఉంటేనే దిగడం మంచిది !
ఇవాళ పది రూపాయలు పెట్టి కొన్న షేర్ రేపు వంద అవుతుంది.. ఒక్క రోజులోనే 90 రూపాయలు లాభం అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. కానీ మొత్తం స్టాక్ మార్కెట్ పై అవగాహన లేకుండా ఈ లాభం శాశ్వతం అనుకుంటే..అది ఓ గాలం అని తరవాత అర్థమవుతుంది. స్టాక్ మార్కెట్లు స్థిరమైన పెట్టుబడులకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటాయి. అందులోనూ ఎన్ని మోసాలు ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. స్టాక్ మార్కెట్ పై పూర్తి అవగాహన ఉంటే తప్ప అందులో పెట్టుబడుల జోలికి వెళ్లకపోవడం.. ఇన్ ఫ్లూయన్సర్స్ మాటలు నమ్మకపోవడం మంచిది.