ప్రొ.నాగేశ్వర్: ఎన్నికల్లో పోటీ చేయకుండా నేర చరితుల్ని ఎలా అడ్డుకోవాలి..?

నేరచరిత్ర ఉన్నవారిని చట్టసభలకు పోటీ చేయకుండా ఆపే విధంగా చట్టం చేయాల్సిన బాధ్యత పార్లమెంట్‌పైనే ఉందని.. సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ దిశగా కొన్ని సూచనలు చేసింది. భారతదేశంలో ప్రస్తుతం ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. శిక్ష ఖరారయితనే అనర్హతా వేటు పడుతుంది. ఆరేళ్ల వరకూ పోటీ చేయడానికి అవకాశం ఉండదు. మన దేశంలో ఎంపీ నుంచి సర్పంచ్ వరకూ అన్ని స్థాయిలోనూ నేర చరితులు ఉన్నారు. అన్ని పార్టీల్లోనూ ఉన్నారు.

చట్టసభల్లో అన్ని పార్టీల తరపున నేర చరితులు..!

ప్రస్తుతం పార్లమెంట్‌లో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీల్లో 107 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. శివనసేనకు చెందిన వాళ్లు 18, కాంగ్రెస్‌ వాళ్లు 15 మంది ఉన్నారు. కాంగ్రెస్‌కు ఎంపీల సంఖ్య తక్కువ కాబట్టి.. తక్కువగా కనబడుతున్నారు. బీజేపీకి సీట్లు ఎక్కువ కాబట్టి.. ఎక్కువ మంది నేర చరితులు ఉన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలన తరపున… క్రిమినల్ కేసులున్న వారు చట్టసభల్లో ఉంటున్నారు. ఇందులోనూ.. సీరియస్ క్రిమినల్ కేసులు.. అంటే.. హత్యలు, మానబంగాలు, దోపీడీలు లాంటి కేసుల్లో ఉన్న వారు కూడా ప్రధాన రాజకీయ పార్టీల తరపున.. చట్టసభల్లో ఉన్నారు. ఇలాంటి వారిని రాజకీయ పార్టీలు ప్రొత్సహిస్తున్నాయి. ఇందులో ఈ పార్టీ.. ఆ పార్టీ అనే తేడా లేదు. అన్ని పార్టీలు.. కూడా.. క్రిమినల్స్‌ను ప్రొత్సహిస్తున్నాయి. ఇలాంటి వారికి శిక్ష పడదు. నేర చరిత్ర ఉంది. కేసులు ఉన్నాయి. కానీ.. విచారణ దశాబ్దాల పాటు జరుగుతూ ఉంటుంది. ఈ ఇరవై ఏళ్లు.. వాళ్లు గౌరవ సభ్యులుగా.. చట్టసభల్లో కూర్చుంటున్నారు. మహారాష్ట్రలో ఓ పరిస్థితి చెప్పుకోవాలి.. హోంమంత్రిగా ఉండి.. జైలును ప్రారంభించిన ఓ రాజకీయ నేత.. తర్వాత అదే జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత జైలు నుంచే హోంమంత్రి అవుతాడు. అదే భారతదేశంలోని దౌర్భాగ్యం. ఇరవై ఏళ్ల పాటు..విచారణ జరుగుంది. నేర చరిత్ర ఉన్నా… అన్నీ అనుభవిస్తూనే ఉంటారు. ఇలాంటి సమయంలో ఏం చేయాలి..?

కేసులు, చార్జిషీట్లు ఉన్న వారిని పోటీ చేయకుండా ఉంచడం సాధ్యమేనా..?

నేరస్తులై ఉండి కూడా.. పోలీసు భద్రత పొందుతూ ఉంటారు. చట్టాలు చేస్తూ ఉంటారు. సమాజంలో.. గౌరవ ప్రతిష్టలు పొందుతూ ఉంటారు. ఇలాంటివాటికి పరిష్కారం.. ఏమిటన్నదానిపై… చాలా కాలంగా చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తి.. చార్జిషీటు దాఖలైన వారిని పోటీకి అనర్హులుగా ప్రకటించాలని కోరారు. కానీ సుప్రీంకోర్టు… అది తమ విధి కాదని ప్రకటించింది. అనర్హులుగా చేయాలనే చట్టం పార్లమెంట్ చేయాలని చెప్పింది. సుప్రీంకోర్టు పని చట్టాలు చేయడం కాదు. పోటీకి ‌అర్హులా.. ‌అనర్హులా.. అనేది… పార్లమెంట్‌ చేయాలని స్పష్టం చేసింది. పార్లమెంట్ చట్టాలు చేస్తే.. ఆ చట్టం రాజ్యాంగ బద్ధంగా ఉన్నదా లేదా అనేది సుప్రీంకోర్టు చూస్తుంది. కేసులు ఉన్న వాళ్లు.. చార్జిషీట్లు ఉన్న వాళ్లను.. పోటీ నుంచి ‌అనర్హుల్ని చేయాలనేది పిటిషనర్ వాదన. ఈ దేశంలో.. కేసులు ఎవరిపైనైనా పెట్టవచ్చు. చిన్న ప్రజాస్వామిక నిరనస తెలిపితే.. రాజద్రోహం కేసు పెట్టేస్తున్నారు. రాజద్రోహం అంటే.. రాజ్యవ్యవస్థను కూలదొస్తున్నారనే కేసు పెట్టేస్తున్నారు. రాజకీయంగా తమకు అడ్డంగా ఉంటున్నారని.. ఎవరికైనా అనిపిస్తే.. వారిపై ఉన్న పళంగా కేసు బుక్ చేసేస్తున్నారు. ఎవరో నలుగుర్ని… తీసుకొచ్చి కంప్లైంట్ చేయించి.. కేసు పెట్టి.. చార్జిషీట్లు దాఖలు చేస్తున్నారు. ఇలాంటి రాజకీయవ్యవస్థలో మనం ఉన్నాం. అధికారం ఉంటే.. ఏ సీరియస్ కేసులైనా పెట్టగలుగుతున్నారు.

కేసులు దశాబ్దాల పాటు ఎందుకు విచారణల్లో ఉంటున్నాయి..?

ఇలాంటి పరిస్థితులకు పరిష్కారం ఏమిటంటే.. రాజకీయ నేతలపై వచ్చిన కేసులు.. ముఖ్యంగా చట్ట సభల్లో పోటీ చేస్తున్న .. చట్ట సభల్లో ఉన్నటువంటి వారిపై ఉన్న కేసుల్ని వేగంగా విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కేసులు ఉండాలి. నేరారోపల్ని విచారించేందుకు ప్రత్యేకంగా కోర్టులు ఉండాలి. టైమ్ బౌండ్‌ విచారణ జరగాలి. ఆరు నెలల్లో విచారణ జరగాలి. శిక్ష ఖరారు చేయాలి. అలాగే ప్రజల్లో ‌అవగాహన పెంచాలి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి నేర చరితుడని విస్తృతంగా ప్రచారం చేయమని సూచిస్తున్నారు. ప్రత్యేకంగా పోస్టర్లు వేయాలి. అలాగే ఎన్నికల అఫిడవిట్లలో… కేసులన్నీ స్పష్టంగా రాయాలి. కానీ ఎంత మంది అఫిడవిట్లు చూస్తారు..? ‌అందుకనే ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ప్రత్యేకమైన సూచనలు చేసింది. నేర చరితులు అయిన అభ్యర్థుల గురించి పబ్లిసైజ్ చేయమని సూచించింది. అలాగే రాజకీయ పార్టీలు.. తమ తరపున పోటీ చేసే అభ్యర్థుల్లో నేర చరితులు ఉంటే.. వారి వెబ్‌సైట్లో పెట్టాలని సూచించింది. ఇలా చేస్తే.. సోషల్ మీడియాలో..మరో విధంగా ప్రచారం జరుగుతోంది. అలాగే పత్రికల్లో.. టీవీల్లో కూడా.. అభ్యర్థులపై… పార్టీలు.. నేరచరితులు గురించి ప్రచారం చేయాలని .. సుప్రీంకోర్టు సూచించింది.

నేరస్తులకే ప్రజలు ఓట్లు ఎందుకు వేస్తున్నారు..?

సుప్రీంకోర్టు సూచనలు బాగానే ఉన్నాయి. కానీ ప్రజలు.. వాళ్లంతా.. నేర చరితులు కాదన్న ఉద్దేశంతో ఓట్లు వేస్తున్నారా..? వారి నేర చరిత గురించి ప్రజలకు తెలుసు. ఎమ్మెల్యేలు.. అవినీతి పరులని.. ప్రజలకు తెలుసు. అయినా ప్రజలు ఓట్లు వేస్తారు. ఏ పార్టీ తరపున పోటీ చేసిన క్రిమినల్ చరిత్ర ఉన్న వారే పోటీ చేస్తున్నారు. అందుకే.. ప్రజల్లో చైతన్యం రావాలి. నేరస్తుల్ని, అవినీతి పరుల్ని ఓడిస్తే.. రాజకీయ పార్టీలు కూడా వారిని నిలబెట్టడానికి సందేహిస్తాయి. దీని కోసం.. ప్రజల్లో చైతన్యం రావాలి. రాజకీయ పార్టీలు.. నేరస్తుల్ని ఎందుకు నిలబెడుతున్నాయి..? వాళ్లు గెలుస్తారనే టిక్కెట్లను రాజకీయ పార్టీలు ఇస్తున్నాయి. యూపీలో ఓ నేత నేర చరితుడని ఓ పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. కానీ ఆ నేర చరితుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచాడు. చివరికి మంత్రి కూడా అయ్యాడు. మరి ఎందుకు ప్రజల్లో చైతన్యం లేదు..? ప్రజలు ఆలోచించాలి.

ప్రజల్లో చైతన్యం వస్తేనే అసలైన మార్పు..!

భారతదేశంలో చాలా మంది యువత ఉంది. వారంతా.. విపరీతంగా చర్చిస్తూ ఉంటారు. రాజకీయాలు కుళ్లిపోతున్నాయని నేరస్తులు.. పదవుల్లోకి వస్తున్నారని బాధపడుతూ ఉంటారు. చివరికి వారే నేరస్తులకు ఓట్లు వేస్తూ ఉంటారు. అలా ఓట్లు వేయకపోతే.. ఏ పార్టీ కూడా నేరస్తులకు సీట్లు ఇవ్వదు. నేరస్తులందర్నీ ఎప్పటికప్పుడు ఓడిస్తూ ఉంటే.. రాజకీయ పార్టీలు కూడా.. వారికి సీట్లు ఎందుకు ఇస్తాయి..? అంటే.. అంతిమంగా ప్రజల మనసుల్లో మార్పు వస్తే తప్ప నేరస్తులు .. ప్రజాస్వామ్య వ్యవస్థకు దూరం కారు. అంతే కానీ.. ఎన్ని చట్టాలు చేసినా ఏం ప్రయోజనం ఉండదు. ఫిరాయింపు నిరోధక చట్టం తెచ్చారు. కానీ వల్ల ఫిరాయింపులు ఆగాయా.. ? ఇంకా పెరిగాయి. .. ఫిరాయింపులు చేసి.. వేరే పార్టీల్లో మంత్రులుగా కూడా అవుతున్నారు. కళ్ల ముందే ఫిరాయింపు చట్టాన్ని.. చట్టసభల్లోనే ఉల్లంఘిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.