కావేరీ జలాల వివాదం కారణంగా కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో రగిలిన చిచ్చుని ఆర్పడానికి ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆపసోపాలు పడుతుంటే, ప్రతిపక్షాలు వాటికి సహాయపడి రాష్ట్రాలలో మళ్ళీ ప్రశాంత పరిస్థితులు నెలకొనేలా చేయాలి. అది వాటి ధర్మం, బాధ్యత కూడా. కానీ తమిళనాడులో డిఎండికె పార్టీ అధ్యక్షుడు కెప్టెన్ విజయ్ కాంత్ ఆ చిచ్చుని మరింత రగిలించడానికి సిద్దం అవుతున్నారు. కర్ణాటకలో తమిళ ప్రజలపై, వారి ఆస్తులు, వాహనాలపై జరుగుతున్న దాడులకి నిరసనగా ఈ నెల 16నుంచి చెన్నైలోని కోయంబేడు వద్ద గల తమ పార్టీ కార్యాలయం ముందు నిరాహార దీక్షకి కూర్చోబోతున్నట్లు ప్రకటించారు.
ఆయన పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికలలో చాలా ఘోరపరాజయం పొందినప్పటికీ కెప్టెన్ విజయ్ కాంత్ తమిళ సినిమాలలో మంచి పేరున్న నటుడు కూడా కావడం చేత ఆయనకీ రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది అభిమానులున్నారు. వారికి తోడూ పార్టీ కార్యకర్తలు ఉండనే ఉన్నారు. కనుక ఆయన నిరాహార దీక్షకి కూర్చొన్నట్లయితే తమిళనాట తప్పకుండా ఇంకా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడవచ్చు.
ఆయన దీక్ష చేయడానికి కోయంబేడు ప్రాంతాన్ని ఎంచుకోవడం కూడా చాలా చాలా వ్యూహాత్మకంమేనని భావించవచ్చు. అక్కడే చెన్నై ప్రధాన బస్ కాంప్లెక్ ఉంది. అక్కడికి నిత్యం ఆంధ్రా, కర్నాటక, కేరళ వంటి ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి వందలాది ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు వచ్చి వెళుతుంటాయి. కనుక పరిస్థితి ఏ మాత్రం అదుపు తప్పినా ఊహించనంతగా నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉంది. రాజకీయాలలో ఉన్న వ్యక్తులు ఇటువంటి ఆలోచనలు చేయడం చాలా దురదృష్టకరమే. పైగా ఆయన సినిమాలలో గొప్ప పనులు చేస్తున్నట్లు నటిస్తూ నిజజీవితంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం ఇంకా తప్పు. తమిళనాడు ప్రభుత్వం ఆయన దీక్షకి అనుమతిస్తే సమస్య ఇంకా జటిలం అయ్యే ప్రమాదం ఉంది కనుక ముందుగానే ఆయనని అడ్డుకోవడం మంచిది.