తెలంగాణలో రాజకీయాలు చేసిన కాలంలో ఫోన్ ట్యాపింగ్ బాధితుల జాబితాలో షర్మిల కూడా ఉన్నారని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆమె ఫోన్లపై నిరంతరం నిఘా పెట్టి ఎవరెవరితో టచ్ లో ఉంటున్నారో ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి.. “అన్న”కు పంపినట్లుగా సిట్ దర్యాప్తులో తేలినట్లుగా ప్రచారం జరుగుతోంది. తన ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని గతంలో షర్మిల ఆరోపించారు. అయితే ఇలాంటి ఆరోపణల్ని బీఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్థులంతా చేసేవారు కాబట్టి అందులో కలిసిపోయింది. ఇప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
షర్మిల ఫోన్ ట్యాపింగ్ ప్రధానంగా.. అన్న కోసం జరిగిందని కోడ్ భాష ద్వారా పోలీసులు గుర్తించినట్లుగా చెబుతున్నారు. ఆ అన్న ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. కేటీఆర్ కూడా.. జగన్ రెడ్డిని అన్న అని గతంలో సంబోధించారు. షర్మిల కు కూడా జగన్ అన్నే అవుతారు. జగన్ రెడ్డితో ఆస్తి గొడవల తర్వాత షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారు. పాదయాత్ర చేశారు. పెద్దగా బలపడలేకపోవడంతో.. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకుని ఏపీ రాజకీయాల్లోకి వచ్చారు. ఈ క్రమంలో ఆమె రాజకీయాలపై జగన్ కోసం.. తెలంగాణలో నిఘా పెట్టారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరుపుతున్న సిట్.. ఫోన్ ట్యాపింగ్ అయిందని అనుమానిస్తున్న వారి నుంచి వాంగ్మూలాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. షర్మిల కూడా గతంలో ఆరోపణలు చేశారు.. ఇప్పుడు వివరాలు బయటకు వచ్చాయి కాబట్టి.. ఆమె స్టేట్ మెంట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.