వైసీపీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తోంది. అయితే ప్రతీ జిల్లాలో ఏదో ఓ డిమాండ్ వస్తోంది. అది ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేదే. అయితే ఇది ప్రజల నుంచి వస్తుందని చెప్పుకోవడం కన్నా ఎక్కువగా వైసీపీ వర్గాల నుంచే వస్తోంది. వైసీపీ నేతలే ఈ డిమాండ్లు చేస్తున్నారు. పార్టీ అంతర్గత రాజకీయాల్లో తమ బల ప్రదర్శన చేసుకోవడం కోసం ఇలా చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
కడప జిల్లా రాజంపేటలో వైసీపీ వర్గాల మధ్య రచ్చ రచ్చ జరుగుతోంది. ఇక చిత్తూరు జిల్లాలో మదనపల్లి, నగరి, బాలాజీ జిల్లా ఇలా ప్రతి విషయంలోనూ ప్రతి నియోజవకర్గంలో వైసీపీ నేతలు సీఎంను కలుస్తామంటున్నారు. రోజా కూడా తిరుపతికి సమీపంలో ఉన్న నగరిని బాలాజీ జిల్లాలోనే ఉంచారని డిమాండ్ చేస్తున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో ఆనం అయితే వైసీపీకి పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తున్నారు. ఆయనది కూడా తనను పట్టించుకోవడం లేదనే బాధేనని వైసీపీ వర్గాలకు తెలుసు. ఇలా ప్రతి జిల్లాలోనూ రచ్చ అవుతోంది.
ఇలాంటి డిమాండ్లు వినిపిస్తున్న వైసీపీ నేతలను ఎక్కడిక్కకడ బుజ్జగించేందుకు వైసీపీ హైకమాండ్ జిల్లాల వారీగా కొంత మందికి బాధ్యతలు ఇచ్చింది. చాలా వరకూ కూల్ చేస్తున్నారు. ప్రజల్లో సెంటిమెంట్ ఉన్న హిందూపురం వంటి చోట్ల వైసీపీ నేతలు ఆందోళనలు చేసుకోవడానికి హైకమాండే పర్మిషన్ ఇస్తోంది. ఎక్కువ చోట్ల మాత్రం తమ బలం హైకమాండ్కు ప్రదర్శించడానికి ఈ వివాదాన్ని నేతలు పెద్దవి చేస్తున్నారు.
ఈ జిల్లాల ఆందోళనలను వ్యూహాత్మకంగా సద్దుమణిగేలా చేయకపోతే రేపు తుది నోటిఫికేషన్ తర్వాత సమస్యలు వస్తాయని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. వీటిని వీలైనంత త్వరగా సర్దుబాటు చేయాలంటున్నారు.