సైరా నర్సింహారెడ్డి సినిమా చిత్రీకరణ పూర్తి కావడంతో ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది సినిమా యూనిట్. చిరంజీవి ఒక అగ్ర దినపత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు చర్చించారు. అయితే ఇందులో భాగంగా టాలీవుడ్ నవతరానికి చిరంజీవి చేసిన సూచన ఆసక్తికరంగా ఉంది.
గతంలో సినిమా అంటే ఉదయం 7 గంటలకే షూటింగ్ ప్రారంభించేవారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ ల తరం నుండి చిరంజీవి దాకా ఇదే ఒరవడి కొనసాగింది. గత దశాబ్ద కాలంలో పరిస్థితులు మారిపోయాయి. షూటింగ్ అంటే పదకొండు గంటలకు కూడా మొదలు కావడం లేదు. పాత తరం హీరోల లాగా ఇప్పటికి హీరోలు ఏమైనా రోజుకు రెండు మూడు సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారా అంటే అదీ లేదు. ఆలస్యంగా షూటింగ్ ప్రారంభించడం కారణంగా పని సమయం తగ్గి షూటింగ్ పూర్తి కావడానికి పని రోజులు పెరుగుతున్నాయి, దీంతో నిర్మాణ వ్యయం కూడా పెరుగుతుంది. ఇదే విషయంపై సూచనలిచ్చారు చిరంజీవి.
సైరా నర్సింహారెడ్డి సినిమా చిత్రీకరణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు మొదలు పెట్టామని, తన సొంత సినిమా కావడంతో ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా తాను ఉదయాన్నే రావడానికి మొగ్గుచూపానని, చాలా మంది టెక్నీషియన్స్ వచ్చి మళ్లీ పాత రోజులు గుర్తు చేశారు అని అంటూ ఉంటే సంతోషం వేసింది అని , ప్రస్తుత తరం టాలీవుడ్ కి కూడా ఇదే సూచన ఇస్తున్నానని, ఉదయాన్నే త్వరగా షూటింగ్ మొదలు పెట్టడం ద్వారా నిర్మాణం తగ్గించుకోవచ్చని చిరంజీవి సూచించాడు.
ఏది ఏమైనా, చిరంజీవి సూచన ఆచరిస్తే నిర్మాణ వ్యయం తగ్గే అవకాశం ఉందని అందరికి తెలిసిందే.