తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావుకు తెలంగాణ ప్రభుత్వం ఓ పదవి కేటాయించింది. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏదో ఒక పదవి కోసం వేచి చూస్తున్న ఆయనను బీసీ సంక్షేమ, అభివృద్ధి ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చాలా కాలంగా తన సీనియారిటీకి తగిన గుర్తింపు కోరుతున్న వీహెచ్కు, ప్రభుత్వం కేబినెట్ హోదాను కల్పించింది. దీనివల్ల ఆయనకు కేబినెట్ మంత్రులకు ఉండే సమాన స్థాయి ప్రోటోకాల్ ,సౌకర్యాలు లభిస్తాయి
ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ల గడుస్తున్న సమయంలో.. ఏ పదవి రాకపోవడంతో ఆయన ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్నవారిని మర్చిపోకూడదని పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి, ఇతర పార్టీల నుండి చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీ నేతగా పేరున్న వీహెచ్, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై తరచుగా గళం ఎత్తుతుంటారు. కుల గణన విషయంలో జాప్యంపై తన గొంతు వినిపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా బీసీలకు ప్రత్యేక కోటా ఉండాలని, లేదంటే అగ్రవర్ణాలకే ప్రయోజనం కలుగుతుందని అంటూ ఉంటారు.
పలు సందర్భాల్లో తన పర్యటనలకు లేదా తాను చేపట్టే కార్యక్రమాలకు పార్టీ నుండి పూర్తిస్థాయి మద్దతు లభించడం లేదని ఆయన అలక వహించారు. అయితే సీనియర్ నేత అయిన వీహెచ్ పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాల్లో పలుకుబడి కోల్పోయారు. అయినా హైకమాండ్ వద్ద పలుకుబడి ఉండటం.. ఆయన పదవి రాలేదని విమర్శలు చేస్తే… లేనిపోని ప్రచారం జరుగుతుందని కేబినెట్ హోదాలో సలహాదారు పదవిని సీఎం రేవంత్ కేటాయించారు.
