అమరావతికి మరో నలభై వేల ఎకరాల భూములు అవసరం అని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. భూసమీకరణకు సిద్ధమవుతోంది. భూములు ఇచ్చేందుకు సిద్ధమని రైతులు అంటున్నారని మంత్రి నారాయణ ప్రకటించారు. అయితే చాలా మంది రైతుల్లో ఇంకా సందేహం ఉంది. ఇప్పటికే తీసుకున్న భూములకు న్యాయం చేశారా ?. వాటన్నింటిలో పనులు ప్రారంభించారా అని.
ఐదు సంవత్సరాల విధ్వంసం తర్వాత కోలుకుంటున్న అమరావతి
అమరావతి చంద్రబాబు ముందు చూపునకు చక్కని ఉదాహరణ. కానీ ఐదు సంవత్సరాలు ఆ ఆమరావతిని నిర్వీర్యం చేసిన ప్రభుత్వం వచ్చింది. భూములు ఇచ్చిన రైతులూ ఇబ్బందిపడ్డారు. ఇప్పుడు మరోసారి ప్రభుత్వం వచ్చింది. నిధులు సమీకరించుకుని పనులు ప్రారంభించారు. అప్పుడే విస్తరణ ప్రణాళికలను ప్రభుత్వం అమలు ప్రారంభించారు. విస్తరణ మంచిదే…కానీ ఎప్పుడు అంటే.. మొదటి పార్ట్ సక్సెస్అయినప్పుడే. అమరావతి మొదటి పార్ట్ ఇంకా సక్సెస్ కాలేదు. ప్రభుత్వ పనులతో పాటు.. ప్రైవేటు వ్యక్తులు, పరిశ్రమలు కూడా పనులు ప్రారంభిస్తేనే ప్రయోజనం ఉంటుంది.
ఉపాధి కేంద్రంగా అమరావతిని మార్చే ప్రణాళికల్లో మరింత దూకుడు !
ఇప్పటికి అమరావతిలో పనులు జోరుగా సాగుతున్నట్లుగా సమాచారం లేదు. రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను వంద శాతం పంపిణీ చేయలేదు. రైతుల కు కేటాయించిన చోట్ల ఒప్పందం ప్రకారం మౌలిక వసతులను కల్పించలేదు. వాటికీ టెండర్లు పిలిచారు. పనులు జోరుగా చేయించి.. అక్కడ రైతులకు మేలు జరిగితేనే ఇతర రైతుల వద్ద సమీకరణ చేయడం ప్రభుత్వానికి మంచిది.
ఆ తర్వాతే రైతులకు నమ్మకం
సీడ్ క్యాపిటల్ అభివృద్ధి కోసం సింగపూర్ తో చర్చలు జరిపామని కానీ గత ప్రభుత్వం సింగపూర్ వెళ్లి విచారణ జరపడంతో వారు ముందుకు రావడం లేదని నారాయణ చెప్పారు. అంటే నమ్మకాన్ని కూడా గత ప్రభుత్వం కల్చేసిందన్నమాట. కారణం ఏదైనా ఐదు సంవత్సరాల పాటు జరిగిన విధ్వంసాన్ని చాలా త్వరగా పూడ్చడం సాధ్యంకాదు. అలా పూడ్చిన తర్వాతే ఇతర పనులు చేయాల్సి ఉంటుంది.లేకపోతే ఆ గోతుల్లో ప్రయాణం సరిగా సాగదు. ముందుగా అమరావతిలో విజిబుల్ అభివృద్ధి చూపించి.. ప్రైవేటు సంస్థల పెట్టుబడులకు కేంద్రంగా అవుతుందని నమ్మకం కలిగించిన తర్వాతనే విస్తరణపై ముందడుగు వేస్తే ప్రజల నుంచి, భూములు ఇవ్వవలసిన వారి వద్ద నుంచి సానుకూలత వస్తుంది.