మొన్న నంబాల.. నిన్న సుధాకర్.. నేడు భాస్కర్.. వరుసగా జరుగుతూన్న ఎన్ కౌంటర్ల ద్వారా మావోయిస్టు పార్టీ కీలక నేతలను కోల్పోతోంది. చత్తీస్ ఘడ్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ మృతి చెందాడు. బీజాపూర్ లోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలు – మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఆడెల్లు అలియాస్ భాస్కర్ మృతిచెందారు.
ఆడెల్లు అలియాస్ భాస్కర్ తెలంగాణకు చెందినవారే. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పోచ్చెర ఆయన స్వస్థలం. తెలంగాణ రాష్ట్ర కమిటీలో కీలక నేతగా ఉన్నారు. గతంలో అనేక ఎన్ కౌంటర్ల నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. అనేక ఆపరేషన్లలో పాల్గొన్న ఆడెల్లుపై 25లక్షల రివార్డ్ కూడా ఉంది.
అయితే, ఈ ఎన్ కౌంటర్ నుంచి మరికొందరు మావోయిస్ట్ పార్టీకి చెందిన కీలక నేతలు తప్పించుకున్నట్లు సమాచారం. వీరి కోసం భద్రతా దళాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రకమిటీకి చెందిన కీలక నేతలు ఒక్కొక్కరుగా హతం అవుతున్నారు. దీంతో శాంతి చర్చలు చేపట్టాలని మావోయిస్ట్ పార్టీ వరుసగా లేఖలను విడుదల చేస్తోంది. కానీ వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సల్స్ రహిత దేశంగా మార్చుతామని ఎజెండాతో కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్ తుది దశకు చేరుకున్నట్టే కనిపిస్తోంది.