బనకచర్ల విషయంలో ఇంకా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రెండురోజుల కిందట ఏపీ ప్రతిపాదనలు కేంద్రానికి చేరాయని వాటిని ఇంకా పరిశీలించలేదన్నారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టమో కేంద్రానికి.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివేదిక సమర్పించాలని సూచించారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన బనకచర్ల ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న రాజకీయంపై భిన్నంగా స్పందించారు.
బనకచర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరుగుతుందన్న విషయంపై స్పష్టత ఇవ్వకుండానే ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలను బీఆర్ఎస్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయాల కోసం బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకించాల్సి వస్తోంది. బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతించవద్దని అంటున్నారు. అయితే ఆ ప్రాజెక్టుపై అభ్యంతరాలు ఉంటే.. తెలంగాణ ప్రయోజనాలకు విజ్ఞాతం కలిగితే ఖచ్చితంగా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. అడ్డుకుంటుంది. కానీ సముద్రంలోకి పోయే నీరును తరలించుకోవడం వల్ల.. తెలంగాణకు ఎలా నష్టం జరుగుతుందో ఎవరూ వివరించలేకపోతున్నారు.
దిగువ రాష్ట్రం జల దోపిడీ చేస్తోందన్న విమర్శలు చేసి రాజకీయం చేయడం కామన్ గా మారుతోంది. ప్రజలను రెచ్చగొట్టడమే రాజకీయం అన్నట్లుగా సాగుతోంది. ఇప్పుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణకు ఎలా నష్టమో.. కేంద్రానికి వివరిస్తే తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు కిషన్ రెడ్డి రెడీగా ఉంటారు. మరి బీఆర్ఎస్ అయినా.. రేవంత్ ప్రభుత్వం అయినా బనకచర్ల వల్ల తెలంగాణకు ఎలా నష్టమో వివరించగలరా?