పేర్ని నాని పాపం పండిందని , గత ఐదేళ్లలో దోచుకున్న సొమ్మును అంతా కక్కిస్తామని, దమ్ముంటే ఆయన విచారణకు సిద్దంగా ఉండాలని సవాల్ విసిరారు మంత్రి కొల్లు రవీంద్ర. జగన్ హయాంలో మంత్రిగా చెలామణి అయి బందరు నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పేర్ని నానిని ఓడించాక కూడా బుద్ధి మార్చుకోవడం లేదన్నారు. అరెస్ట్ చేస్తారని భయంతో పేర్ని నాని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారన్నారు.
పేర్ని నాని హయాంలో జరిగిన అక్రమాలను త్వరలోనే పూర్తిస్థాయి ప్రజల ముందు ఉంచుతామని కొల్లు రవీంద్ర వెల్లడించారు. మచిలీపట్నం ప్రజలపై ప్రేముంటే 6400,టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇళ్ళ స్థలాల పేరుతో అధిక ధరలకు భూములు కొనుగోలు చేయించి, పేర్ని నాని అనుచరులు కమిషన్లు భారీగా దండుకున్నారని ఆరోపించారు. మచిలీపట్నం మెడికల్ కాలేజ్ భూవ్యవహారంలోనూ అవకతవకలు చోటు చేసుకున్నాయని ,వీటిపై విచారణ జరిపిస్తామన్నారు కొల్లు రవీంద్ర.
పేదలకు అందాల్సిన 8వేల బియ్యం బస్తాలను స్వాహా చేసి పేర్ని నాని ఇప్పుడు బుకాయిస్తున్నారని , అయినా ఎన్నిచేసినా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు కొల్లు రవీంద్ర. ఇక, బందరు పోర్టును 2006లోనే అమ్మేందుకు పేర్ని నాని ప్రయత్నించారని, ప్రజల పోరాటం ఫలితంగా బందరు పోర్టును సాధించుకున్నట్లు చెప్పారు. ఈ పోర్టుపై ప్రేమను ఒలకబోస్తున్న పేర్ని నాని, గత ప్రభుత్వ హయాంలో ఎందుకు పోర్టును పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు.
పేర్ని నాని అవినీతి చిట్టాను ప్రజల ముందు ఉంచుతాం. అసెంబ్లీలో చొక్కా పట్టుకొని నిలదీస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు కొల్లు రవీంద్ర.