కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంపై వైసీపీ చేస్తోన్న ఆరోపణలను నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు మంత్రి సవిత. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సవిత మీడియాతో మాట్లాడారు.
తల్లికి వందనం పథకం నిధుల్లో 2వేలు మంత్రి నారా లోకేష్ అకౌంట్ లోకి వెళ్తున్నాయని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలపై మంత్రి సవిత ఘాటుగా స్పందించారు. లోకేష్ అకౌంట్ లోకి 2వేలు వెళ్తున్నట్టు ఆధారాలు చూపిస్తే ఎమ్మెల్యేతోపాటు తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. లేదంటే పులివెందుల ఎమ్మెల్యే జగన్ తన పదవికి రాజీనామా చేస్తారా? అని ఛాలెంజ్ చేశారు.
ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని సవిత అన్నారు. తల్లికి వందనం పథకంతో కూటమి సర్కార్ పట్ల ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడిందని అందుకే , తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. శుక్రవారం లోకేష్ కూడా వైసీపీ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు.
24 గంటల సమయం ఇస్తున్నా… నా ఖాతాలో 2వేలు పడినట్టు నిరూపించాలి లేదంటే , ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లోకేష్. అలా చేయకుంటే న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు. గతంలోలాగా అసత్య ఆరోపణలపై మౌనంగా ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.