డబ్బున్న ప్రాణానికి, పేద ప్రాణానికికి ఎంతో తేడా ఉంటుంది. మద్యం మత్తులో రోడ్డుపక్కన పడి చనిపోయిన ప్రాణం కోసం.. రాజకీయ నేతలు గళమెత్తారు. హత్య చేశారని ఉద్యమం చేశారు. కోర్టుల్లో పిటిషన్లు వేశారు. ప్రభుత్వంపై రాజకీయ యుద్ధం చేస్తామని ప్రకటించారు. అదే ఓ కారు తొక్కేసి.. పట్టించుకోకుండా.. రోడ్డు పక్కన పడేసిపోయిన ప్రాణం పేదది. కనీస వైద్యం అందకపోవడం చనిపోయాడు. కానీ ఆ పేద దళిత ప్రాణం, కుటుంబం కోసం మాట్లాడుతున్న వారు లేరు. ఒక్కరూ నోరెత్తడం లేదు. పైగా.. జగన్ కోసం వైసీపీ దళిత నేతలు టీవీల్లో ఏడుస్తున్నట్లుగా నటిస్తున్నారు. ఇదేం మానవత్వం.
పాస్టర్ ప్రవీణ్ కోసం మాట్లాడిన వాళ్లకు ఇప్పుడు నోరు రావడం లేదంటి?
పగడాల ప్రవీణ్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి బైక్ మీద బయలుదేరి దారిలో పలు మార్లు ప్రమాదాలకు గురయ్యారు. అనేక సార్లు మద్యం తాగారు. చివరికి రాజమండ్రి దగ్గర కిందపడి చనిపోయారు. అన్ని ఆధారాలతో స్పష్టంగా ఈ వ్యవహారం ఉంది. అయితే ఆయన మృతిని కమ్యూనల్ గొడవకు కేంద్రంగా చేయాలని అనుకున్నారు. ఎంత రాజకీయం చేయాలో అంతా చేశారు. హర్షకుమార్ అనే నేత.. దేశవ్యాప్తంగా ఉన్న పాస్టర్లను తెచ్చి సభలు,సమావేశాలు పెట్టి ప్రవీణ్ ను హత్యచేశారని ప్రచారం చేస్తానని ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేశారు. ఆయన తాగి నడిపి ప్రమాదానికి గురై చనిపోయారు.కానీ సింగయ్యను.. తొక్కి చంపేశారు. దృశ్యాల్లోనూ ఉంది.కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.
పేదలకు మద్దతు ఇవ్వని దళిత నాయకులు – వారి స్వార్థమే ముఖ్యం
సింగయ్య కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. తన కారే తొక్కిందని తేలిన తర్వాతనే జగన్ .. అంబటి రాంబాబుతో పది లక్షలు పంపించారు. చేతనైనంత సాయం అని జగన్ చెప్పుకున్నారు. అంటే ఆ కుటుంబం ఇక రోడ్డున పడినట్లే. అసలు అది ప్రమాదం కాదు. నిర్లక్ష్యం. ఘోరం. జగన్ రెడ్డికి తెలిసి ..ఆయన కళ్ల ముందు జరిగిన ఘోరం. అయినా దాచి పెట్టారు. కనీస వైద్యం అందించే ఏర్పాట్లు చేయకుండా ముళ్లపొదల్లో పడేసి వెళ్లిపోయారు. వీడియోలు బయటకు వచ్చే వరకూ సైలెంట్ గా ఉన్నారు. వీడియోలు బయటకు వచ్చాక అసలు రచ్చ ప్రారంభమయింది. మరి ఒక్క దళిత నేత కూడా ఎందుకు మాట్లాడటం లేదు. హర్షకుమార్, ప్రతి దానికి సోషల్ మీడియాలో పెట్టే సునీల్ కుమార్.. సహా అనేక మంది దళిత నేతలు ఓ పేద కుటుంబానికి అండగా ఉండేందుకు ముందుకు రావడం లేదు. ఎందుకంటే జగన్ రెడ్డికి ఎక్కడ కష్టం వస్తుందో అని వారి భయం.
దళిత పేదలను పావులుగా వాడుకుంటున్న వైసీపీ
దళిత సింగయ్యను ఘోరంగా తొక్కి చంపేసిన వ్యవహారంతో దళితుల్లో ఆగ్రహం తలెత్తకుండా.. జగన్ రెడ్డి ఎంత ఉదాత్తుడో అని సాక్షి టీవీలో స్కిట్స్ వేయిస్తున్నారు. జూపూడి ప్రభాకర్ తో .. ఏడుపులు, డ్రామాలు వేయిస్తున్నారు. ఆ ప్రభాకర్ కు జగన్ కారు సీజ్ చేస్తే కన్నీళ్లు వచ్చాయట. మరి ఓ దళిత ప్రాణం పోతే ఏమీ అనిపించలేదా?. మానవత్వానికే మచ్చగా ఉన్న ఇలాంటి రాజకీయాల్లో దళిత నేతలు భాగం అవుతున్నారు . దళితుల పేరుతో పేరు తెచ్చుకుని రాజకీయాలు చేసేవారు.. పావులుగా మారుస్తున్నారు. వారు బాగుపడుతున్నారు .. కానీ దళితులు మాత్రం అణిగిపోతున్నారు. దానికి సాక్ష్యం.. సింగయ్య కుటుంబం..కోడికత్తి శీను కుటుంబాలే. ఈ బానిసత్వమే వారిని ఎదగకుండా చేస్తుంది… ఇప్పటికైనా ఎదుగుతారో లేదో మరి !