నిన్న రోజంతా ‘ఇదిగో ప్రత్యేక ప్యాకేజి..అదిగో ప్యాకేజి..’అంటూ ఊరించిన కేంద్రప్రభుత్వం చివరికి ఎటువంటి ప్యాకేజి ప్రకటించకుండానే, ‘రాష్ట్ర విభజన వలన ఏపి చాలా నష్టపోయింది…ఇంతవరకు కేంద్రప్రభుత్వం ఏపికి ఎంత సహాయం చేసిందో జాబితా చదివి వినిపించి, ఇక ముందు కూడా ఏపిని ఆదుకొంటూనే ఉంటాము,” అని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పాడిందే పాత పాట మళ్ళీ మరోమారు రాత్రి 10.40 గంటలకి పాడి ఆంధ్ర ప్రజలకి జోలపాడారు. కానీ ఆ పాటతో ప్రజల నిద్ర పాడుచేశారు. ఏపికి ప్యాకేజిలో భాగంగా కేంద్రప్రభుత్వం ఏమేమి ఇవ్వబోతోందో ఈరోజు ప్రభుత్వ వెబ్ సైట్లో పెడతామని మీడియా సమావేశాన్ని ముగించారు.
ఇంతకీ ఆయన ఏమి చెప్పారంటే, “విభజన కారణంగా ఏపి చాలా నష్ట పోయింది కనుక గత ఏడాది రెవెన్యూ లోటు భర్తీ కోసం రూ.3,975కోట్లు ఇచ్చాము. మిగిలింది కూడా దశల వారీగా 100 శాతం ఇస్తాం. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి దాని కోసం చేసిన ఖర్చుని కేంద్రప్రభుత్వమే భరిస్తుంది. విశాఖ-చెన్నై, బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్ల నిర్మాణానికి రూ. 12,000 కోట్లు ఇస్తాం. విభజన చట్టంలో పేర్కొన్న ప్రతీ హామీని తూచా తప్పకుండా అమలుచేస్తాం. ఏపితో సహా దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు. రైల్వేజోన్ పై రైల్వే మంత్రి నిర్ణయం తీసుకొంటారు. నియోజక వర్గాల పెంపు ప్రతిపాదనని హోంశాఖ పరిశీలిస్తోంది,” అని చెప్పారు.
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ, “ఏపికి సాయం అనేది నిరంతరంగా సాగే ప్రక్రియ. రాష్ట్రం మళ్ళీ తన కాళ్ళ మీద తాను లేచి నిలబడే వరకు కూడా కేంద్రప్రభుత్వం సాయం అందిస్తూనే ఉంటుంది,” అని చెప్పారు.
కేంద్రమంత్రి ఈ ప్రకటన చేయకుండా ఉండి ఉంటే ప్రజలు ఎక్కువ సంతోషింఛి ఉండేవారు. కానీ ఆయన నిద్రపోతున్న సింహాలని కర్రతో కొట్టి లేపి, మళ్ళీ జోలపాడి నిద్రపుచ్చే ప్రయత్నం చేసినట్లు ఈ ప్రకటన చేయడంతో, ప్రజలు, ప్రతిపక్షాలు అందరూ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ విషయంలోను స్పష్టత ఈయలేనప్పుడు అసలు అర్దరాత్రి ఈ సమావేశం ఎందుకని విసుక్కొంటున్నారు.
రైల్వేజోన్ సమస్యని మళ్ళీ కెలికినందుకు విశాఖలో దాని గురించి అప్పుడే ఆందోళనలు మొదలయ్యాయని తెలిసిన తరువాత కనీసం దాని గురించైనా క్లారిటీ ఇవ్వకుండా రైల్వే మంత్రి మాట్లాడుతారని చెప్పడంతో రైల్వేజోన్ విజయవాడకి తరలింపు గురించి మీడియాలో వచ్చిన వార్తలు నిజమేనన్న అభిప్రాయం ప్రజలలో కలిగించారు.
ప్రత్యేక ప్యాకేజి పూర్తి వివరాలు ఈరోజు వెబ్ సైట్లో పెడతామని చెప్పారు కనుక ఆ వివరాలు బయటకి వచ్చే వరకు కేంద్రప్రభుత్వాన్ని నిందించడం కూడా సరికాదు. ప్రత్యేక ప్యాకేజి గురించి పూర్తి వివరాలు తెలుసుకొన్న తరువాతనే స్పందించడం మంచిది.