ప్రత్యేక హోదా విషయంలో ఎదురైన అనుభవం తెలుగుదేశం సర్కారుకు బాగానే అర్థమౌతుంది కదా! ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చెయ్యండీ.. అంటూ కేంద్రంపై ఒత్తిడి తేవడంలో బాబు సర్కారు ఫెయిల్ అయింది. హోదాకు బదులుగా ప్యాకేజీ సాధించుకున్నామని గొప్పగా చెప్పుకుంటున్నా…స్పెషల్ స్టేటస్ విషయంలో తెలుగుదేశం ఫెయిల్యూర్ను ప్రజలు మరచిపోవడం లేదు. ఆ అనుభవంతో ఇప్పుడు ప్యాకేజీ చట్టబద్ధతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు.
పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత.. ఏపీ సీఎం మీడియాతో మాట్లాడారు. డిజిటల్ ఎకానమీ కోసం తాము సూచించిన ఎన్నో అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యత దక్కిందన్నారు. నిజానికి, బడ్జెట్లో పోలవరం ప్రస్థావన లేకపోయినా కూడా.. నాబార్డుకు నిధులు పెంచారు కాబట్టి, అక్కడి నుంచే మనకు నిధులు వస్తాయి కాబట్టీ, అదీ పెద్ద సమస్య కాదు అన్నారు. ప్యాకేజీ విషయంలో తొందరలో చట్టబద్ధత వస్తుందని ఆశిస్తున్నామన్నారు. త్వరలో జీవో ఇష్యూ చేయాలని కోరుతున్నా అన్నారు. మనకూ చాలా ఆర్థిక ఇబ్బందులున్నాయనీ, అయినాసరే ఒక్కోటిగా ఎదుర్కొంటూ వస్తున్నామనీ, కేంద్రం ఇవ్వాల్సిన నిధులను వీలైనంత తొందరలో క్లియర్ చేస్తే బాగుంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. విభజన జరిగి రెండున్నర సంవత్సరాలు దాటిపోయింది, ఇవ్వాల్సిన డబ్బులు సకాలంలో ఇస్తే చాలా ఉపయోగ పడతాయని ముక్తాయించారు!
చంద్రబాబు మాటలను జాగ్రత్తగా గమనిస్తే… రెండున్నర సంవత్సరాల్లో ఏదైనా అభివృద్ధి జరిగితే అది తమ కష్టం అన్నట్టుగా చిత్రిస్తున్నారు! జరగలేదంటే.. కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న భావన క్రియేట్ చేస్తున్నారు. ఓ రకంగా ఇది ముందు జాగ్రత్త చర్యగానే కనిపిస్తోంది. సో.. ప్యాకేజీకి చట్టబద్ధత విషయంలో కూడా అందరి దృష్టినీ కేంద్రంవైపు మళ్లించే ప్రయత్నమే చేస్తున్నారు. దాని కోసం తెలుగుదేశం సర్కారు చేస్తున్న ప్రయత్నమేంటో చెప్పడం లేదు! చట్టబద్ధత కోసం ఫలానా స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నామనిగానీ, బడ్జెట్లో ఏపీకి ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదు కాబట్టి, ప్యాకేజీ చట్టబద్ధత అయినా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టుగానీ చంద్రబాబు మాట్లాడటం లేదు! ఒకవేళ చట్టబద్ధత ఆలస్యం అయితే … అది కేంద్రం అలసత్వం అనే ధోరణివైపు ప్రజలను మళ్లిస్తున్నట్టుగా ఉంది! అంతేగానీ, తెలుగుదేశం ప్రయత్నం లోపం గురించి మాట్లాడటం లేదు. ప్యాకేజీ విషయంలో కూడా ఎందుకీ సన్నాయి నొక్కులు..?