ఈరోజు సాయింత్రం హైదరాబాద్ లో గద్దర్ అవార్డుల కార్యక్రమం జరగబోతోంది. చాలా ఏళ్ల తరవాత తెలంగాణ ప్రభుత్వం సినిమా వాళ్లకు ఇస్తున్న అవార్డులు ఇవి. పెండింగ్ అవార్డులన్నీ ఒకేసారి ఇవ్వడంతో అవార్డు గ్రహీతల లిస్టు పెద్దదిగానే ఉంది. అవార్డులు అందుకొంటున్నవారిలో నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్ లాంటి స్టార్లు ఉండడంతో ఈ కార్యక్రమానికి మరింత కళ వచ్చింది. ఎఫ్డీసీ ఛైర్మన్ గా దిల్ రాజు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకొంటున్నారు. చిత్రసీమలోని ప్రముఖులందర్నీ ఈ కార్యక్రమానికి తీసుకురావాలన్నది ఆయన ప్రయత్నం. అందుకే స్వయంగా ఫోన్లు చేసి మరీ పిలిచారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్ర తారలు ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. నలుగురు దిగ్గజాల్ని మళ్లీ ఒకేసారి, ఒకేతెరపై చూసే అవకాశం దక్కబోతోంది. ఈ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇండస్ట్రీకి వరాలు కురిపిస్తారని చిత్రసీమ ఆశిస్తోంది.
రేవంత్ సర్కార్ కూడా గద్దర్ అవార్డుల కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. హైటెక్స్ లో భారీ హంగులతో అందమైన సెట్ వేశారు. ప్రైవేటు అవార్డుల కార్యక్రమం ఎంత ఆహ్లాదంగా, ఎంత ఉత్సాహంగా జరిపిస్తారో, అదే జోష్ తో గద్దర్ అవార్డుల వేడుక జరిపించాలని భావిస్తున్నారు. ఈ వేడుక క్లిక్ అయితే, ఇక నుంచి ప్రతీ యేడాది గద్దర్ అవార్డుల్ని క్రమం తప్పకుండా అందించే వీలు ఉంటుంది. సాయింత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలు కాబోతోంది. అట్లీ సినిమా షూటింగ్ లో ముంబైలో బిజీగా ఉన్న బన్నీ.. ఈ అవార్డు కోసం హైదరాబాద్ వస్తున్నారు. సుకుమార్ కూడా విదేశాల్లో ఉన్నారు. కానీ అవార్డు కోసం నిన్న రాత్రే హైదరాబాద్ చేరుకొన్నారు.