ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టానికి తెరలేవబోతోంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్లో తన భారీ ఏఐ హబ్ నిర్మాణానికి ముహుర్తం ఖరారు చేసింది. సుమారు 15 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 1.25 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ఈనెల ఏప్రిల్ 28న అధికారికంగా శంకుస్థాపన జరగనుంది. విశాఖపట్నం సమీపంలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే 601.4 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో వేలాది మంది ఐటీ నిపుణులకు ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా, ఏపీ గ్లోబల్ టెక్ హబ్గా మారేందుకు దోహదపడనుంది.
ఈ ప్రతిష్టాత్మక శంకుస్థాపన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. గూగుల్ ప్రతినిధుల తరపున గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ స్వయంగా హాజరై ప్రాజెక్టు పనులను ప్రారంభించనున్నారు. గూగుల్ ప్రతినిధులతో మంత్రి లోకేష్ జరిపిన చర్చలు సఫలమవ్వడం, ప్రభుత్వం కల్పించిన వేగవంతమైన అనుమతుల వల్లే ఇంతటి భారీ పెట్టుబడి రాష్ట్రానికి వచ్చింది. ఈ ఏఐ హబ్ కేవలం ఏపీకే కాకుండా, దక్షిణ భారతదేశం మొత్తానికి డేటా స్టోరేజ్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో వెన్నెముకగా నిలవనుంది.
ప్రభుత్వ అంచనాల ప్రకారం, ఈ ప్రాజెక్టు నిర్మాణం వేగంగా పూర్తి చేసి జూలై 2028 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ డేటా సెంటర్ వల్ల విశాఖ తీరం ఒక సరికొత్త డిజిటల్ కారిడార్ గా రూపుదిద్దుకోనుంది. ఏపీని ఐటీ రంగంలో అగ్రగామిగా నిలపాలన్న ప్రభుత్వ సంకల్పానికి గూగుల్ వంటి గ్లోబల్ బ్రాండ్ రాక పెద్ద ఊపునిస్తుందని ఐటీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. శంకుస్థాపన ముగిసిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించేందుకు గూగుల్ తన ఇంజనీరింగ్ బృందాలను ఇప్పటికే రంగంలోకి దించింది. నిర్మాణ పనులను అదానీ సంస్థ చూస్తోంది.
