ప్రతి దర్శకుడికీ ఓ స్టైల్ ఉంటుంది. ఉండాలి కూడా. గుణశేఖర్కీ ఓ స్టైల్ ఉంది. తన సినిమా మిస్ ఫైర్ అయినా.. తన స్టైల్ మాత్రం ఏ సినిమాలోనూ మిస్ కాలేదు. అయితే ఒక్కటే తేడా. పావలా సినిమాకి ముప్పావలా ఖర్చు పెడతాడు. నిర్మాతలో పెట్టిస్తారు. మార్కెట్, రేంజ్ ఇవేం పట్టించుకోకుండా గుడ్డిగా డబ్బులు పెట్టేస్తుంటాడు. రుద్రమదేవికి అదే తప్పు చేశాడు. అనుష్క రేంజ్ ఏంటో? తన సినిమా హిట్టయితే ఎంత వసూలు చేయగలదో ఇలాంటి లెక్కలేం వేసుకోకుండా ఆ సినిమాపై భారీ ఎత్తున ఖర్చు పెట్టాడు. మొత్తంగా బడ్జెట్ రూ.65 కోట్ల వరకూ అయ్యింది. దాని వడ్డీలు కలుపుకొంటూ రూ.70 కోట్ల లెక్క తేలింది. కనీసం అందులోంచి సగం కూడా రాబట్టుకోలేకపోయాడు గుణ. ఇప్పుడు సేమ్ టూ సేమ్ అదే తప్పు రిపీట్ చేయబోతున్నాడు.. హిరణ్యకశ్యపతో.
భక్త ప్రహ్లాద కథలో హిరణ్య కశ్యపుడి పాత్ర కీలకం. అయితే ఈ పాత్రని హైలెట్ చేస్తూ భక్త ప్రహ్లాద కథని తనదైన కోణంలో చెప్పాలనుకొంటున్నాడు గుణశేఖర్. తన ఆలోచన మంచిదే. ట్రెండ్కి విరుద్దంగా ఈదుకొని వెళ్లడం ఆహ్వానించదగిన విషయమే. అయితే.. ఈ సినిమా కోసం రూ.75 కోట్ల బడ్జెట్ కేటాయించాలనుకొంటున్నాడట. మహేష్ బాబు, ఎన్టీఆర్లాంటి స్టార్ హీరో సినిమాకే ఈ స్థాయి బడ్జెట్ మరీ ఓవర్ అయిపోతుంది. అలాంటిది హీరో ఎవరో ఫైనలైజ్ చేయకుండా ‘ఇంత ఖర్చు పెట్టాల్సిందే’ అని ముందుగానే ఫిక్సయిపోవడానికి ఎంత ధైర్యం ఉండాలి? ఈ సినిమా కోసం ముగ్గురు హీరోల్ని మైండ్లో పెట్టుకొన్నాడు గుణశేఖర్. వాళ్లలో రానా కూడా ఉన్నాడు. రానాతో ఈ స్థాయి బడ్జెట్లో సినిమా తీయాలనుకోవడం మొండితనం కాకపోతే మరేంటి? హాలీవుడ్ స్థాయి మేకింగ్ వాల్యూస్తో, వాల్ట్ డిస్నీ కలరింగుతో ఈ సినిమా చేయాలని గుణ ముందే బలంగా ఫిక్సయిపోయాడట. అందుకే హీరో ఎవరైనా సరే.. ఇంత బడ్జెట్ పెట్టాల్సిందే అంటున్నాడట. ఈ సినిమాలో గుణతో పాటు మరో అగ్ర నిర్మాణ సంస్థ జాయిన్ అవ్వబోతోంది. గుణ బడ్జెట్ చూసి కచ్చితంగా కళ్లు బైర్లుగమ్మడం ఖాయం.