మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణ కోసం తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన జీవో:123ని హైకోర్టు సింగిల్ జడ్జ్ కొట్టివేయడంతో, దానిపై హైకోర్టు డివిజన్ బెంచ్ ని ఆశ్రయించింది. తెలంగాణా ప్రభుత్వం రైతులు, రైతు కూలీలకి కూడా న్యాయం చేస్తుందని కనుక జీవో:123 పై సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుని నిలిపివేయవలసిందిగా తెలంగాణా ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది హైకోర్టుని అభ్యర్ధించారు. ఆయన వాదనలు విన్న తరువాత ఆ జీవో:123పై విధివిధానాలు రూపొందించుకొని, మళ్ళీ సోమవారం విచారణకి హాజరుకమ్మని ఆదేశించింది.
తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన జీవో:123 పట్ల వ్యతిరేకత ప్రదర్శించకుండా, రైతులకి, రైతు కూలీలకి ఏవిధంగా న్యాయం చేయాలనుకొంటోందో స్పష్టం చేస్తూ అదే జీవోలో విధివిధానాలు రూపొందించుకొని రమ్మని హైకోర్టు ఆదేశించడం గమనిస్తే, ఆ జీవో పట్ల సానుకూలంగానే ఉన్నట్లు స్పష్టం అవుతోంది. తెలంగాణా ప్రభుత్వం హైకోర్టుకి సంతృప్తికలిగించే విధంగా అందులో విధివిధానాలు పొందుపరిస్తే ఆ జీవోని యదతదంగా ఆమోదించవచ్చని భావించవచ్చు. ఒకవేళ హైకోర్టు ఆ జీవోని ఆమోదించినట్లయితే, ఇంతవరకు సంబరాలు చేసుకొన్న ప్రతిపక్షాలు మళ్ళీ భూసేకరణ చట్టం-2013 ప్రకారమే మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణ చేయాలని డిమాండ్ చేస్తూ మళ్ళీ పోరాటాలు మొదలుపెట్టవచ్చు. ఇంకా ఓపిక ఉంటే హైకోర్టు తీర్పుని సుప్రీం కోర్టులో సవాలు చేయవచ్చు. కానీ ఈసారి ప్రతిపక్షాలు తెలంగాణా ప్రభుత్వాన్ని అడ్డుకోలేకపోవచ్చు.