హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఊహించనంతగా మార్పులకు గురవుతోంది. పదేళ్ల కిందట హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల ఇల్లు లేదా స్థలం కొన్నవారు ఇప్పుడు తమ పెట్టుబడికి రెట్టింపు కంటే ఎక్కువ లాభం పొందుతున్నారు. విజయవాడ హైవే వైపు, మేడ్చల్ వైపు.. అలాగే ముంబై హైవే వైపు ఏ వైపున ఇల్లు సొంతం చేసుకుని ఉన్నా ఇప్పుడు వారు తాము మంచి పని చేశామని గుర్తు చేసుకున్నప్పుడల్లా అనుకుంటూ ఉంటారు.
2015లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఓ అనిశ్చిత పరిస్థితి ఉంది. హైదరాబాద్ సగం ఖాళీ అవుతుందని.. పరిశ్రమలు రావని.. పెట్టుబడులు రావని చెప్పుకున్నారు. దానికి తగ్గట్లుగానే కొన్నాళ్లు స్తబ్దత ఉంది. ఆ సమయంలో.. విజయవాడ హైవేవైపు వనస్థలిపురం దాటిన తర్వాత ఇరవై లక్షలకు ఇండిపెండెంట్ హౌస్లు అందుబాటులో ఉన్నాయి. మేడ్చల్ వైపు ఓ రెండు, మూడు లక్షలు ఎక్కువ అయినా అదే రేటు., ముంబై హైవే వైపు.. పటాన్ చెరు వరకూ పాతిక లక్షలకు మంచి విశాలమైన ఇండిపెండెంట్ హౌస్లు అమ్మకాలు సాగాయి. అప్పట్లో అపార్టుమెంట్లు పదిహేను లక్షలలోపునే వచ్చేవి.
అప్పట్లో ఇళ్లు కొనుగోలు చేసిన వారికి ఈ అంశంపై స్పష్టత ఉంది. ఇప్పుడు తమ చుట్టుపక్కన జరిగిన అభివృద్ధి..పెరిగిన రేట్లను చూసుకుని.. తాము మంచి పని చేశామని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అయితే తాము ఇల్లు కొనలేమని అనుకుంటారు. డబుల్ బెడ్ రూం అపార్టుమెంట్ కనీసం అరవై లక్షలు ఈ ఏరియాల్లో చెబుతున్నారు. కాస్త లగ్జరీ అయితే ఇంకా ఎక్కువ రేటు. ఇక ఇండిపెండెంట్ హౌస్ అయితే కనీసం కోటిన్నర పెట్టాల్సిందే. అంటే పదేళ్లలో పాతిక లక్షల నుంచి తమ ఇంటి విలువ కోటికి చేరుకుందని అర్థమవుతుంది. ఇంత కంటే మంచి పెట్టుబడి ఎక్కడ పెట్టగలరు ?
ఇప్పుడు కొనుగోలు చేస్తే.. వచ్చే పదేళ్ల తర్వాత ఇదేస్థాయిలో పెరుగుతుందా అంటే.. చెప్పడం కష్టం. కానీ రియల్ ఎస్టేట్ మార్కెట్ను అంచనా వేయలేం. అంత కంటే ఎక్కువగానే పెరగవచ్చు. కానీ తగ్గవు.