మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. మఖ్యమంత్రి రేవంత్ తప్పు చేస్తున్నారని తెరపైకి వచ్చారు. ఒక రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. నిజానికి మోత్కుపల్లి కాంగ్రెస్ నేత కాదు. ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించారు. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో.. కర్ణాటక వెళ్లి.. డీకే శివకుమార్ తో భేటీ అయి కాంగ్రెస్లో చేరారు. ఆయన పేరును తుంగతుర్తి సీటుకు పరిశీలించారు కానీ.. కోమటిరెడ్డి బ్రదర్స్ .. తమ అనుచరుడికే సీటు ఇప్పించుకున్నారు.
లోక్సభ ఎన్నికల్లో అయినా తనకు సీటు గురించి ఆలోచిస్తారేమోనని మోత్కుపల్లి నరసింహులు ఆశించారు. కానీ ఆయన పేరును పరిగణనలోకి తీసుకోలేదు. కడియం శ్రీహరిని చేర్చుకుని ఆయన కుమార్తెకు టిక్కెట్ ఇవ్వడంతో మరింతగా ఫైరవుతున్నారు. ఆయన మాదిగ నేత కాదని.. ఆయన కులమేటో తెలియని అంటున్నారు. మంద కృష్ణ మాదిగ చేస్తున్న విమర్శలు కరెక్టేనంటున్నారు. మోత్కుపల్లి మాదిగ నినాదం ఎత్తుకోవడానికి కారణం ఆయన మాటల్లోనే స్పష్టమయింది. తనకు రేవంత్ ఇంత వరకూ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని అంటున్నారు. అదే సమయంలో జితేందర్ రెడ్డినిరాత్రికి రాత్రి చేర్చుకుని పదవి ఇచ్చారని తమను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆయన ఉద్దేశం ప్రకారం.. టిక్కెట్ కాకపోయినా ఏదో ఓ పదవి ఇవ్వాలని అర్థం.
అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే. నాయకుడితో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకుని పదవిపొందాలి కానీ ఇలా రెబల్ గా వ్యవహరించి.. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేలా విమర్శలు చేసి.. పదవి కావాలంటే ఎలా ఇస్తారన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయి. పైగామోత్కుపల్లి కాంగ్రెస్ కోసం పని చేసిన వ్యక్తి కాదు. ఎన్నికలకు ముందు చేరారు. గతంలో ఆయన తిట్టని నేత లేరు. చివరికి ఎన్టీఆర్ ను కూడా తిట్టారు. చంద్రబాబును.. కేసీఆర్.. బీజేపీ ఇలా ఏ పార్టీని వదల్లేదు. ఫెయిల్డ్ పాలసీ అయినా .. మోత్కుపల్లి అదే పాటిస్తున్నారు. ఎవరికీ కాకుండా పోతున్నారు.