దళితుల శిరోముండనం కేసులో దోషిగా తేలి జైలు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిముర్తులకు జగన్ అభయం ఇచ్చారు. జైలు శిక్ష పడినా అభ్యర్థి ఆయనేనని స్పష్టం చేయడంతో ప్రచారం కొనసాగిస్తున్నారు. నిజానికి శిరోముండనం కేసు రాష్ట్ర వ్యాప్తంగా దళితుల సెంటిమెంట్ తో ముడిపడిన అంశం. ఈ కేసులో తోట త్రిమూర్తులకు శిక్ష పడాలని రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు ఆందోళనలు చేశాయి. ఇప్పుడు శిక్ష పడింది.
తోట త్రిమూర్తులకు శిక్ష పడిన తర్వతా దళిత సంఘాలు సంబరాలు చేసుకున్నాయి. అయితే ఆయన వెంటనే బెయిల్ తెచ్చుకుని జైలుకెళ్లే ప్రమాదాన్ని తప్పించుకున్నారు. కానీ శిక్ష మాత్రం ఖరారయింది. హైకోర్టు స్టే ఇస్తే తప్ప.. శిక్ష అనుభవించాల్సిందే. తోట త్రిమూర్తులతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి.. అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ అధినేత మాత్రం దళితల డిమాండ్లను పట్టించుకునే పరిస్థితుల్లో లేరు.
దళితుడ్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఘటనలో ఎమ్మెల్సీ అనంతబాబును ఎలా ప్రోత్సహిస్తున్నారో తోట త్రిమూర్తులను కూడా అలాగే ప్రోత్సహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతబాబు విషయంలో దళితులు , గిరిజనులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఏం చేసినా దళితులు తమ ఓటు బ్యాంక్ గానే ఉంటారని ఇతర పార్టీలకు పోరన్న పెత్తందారి పోకడల కారణంగానే ఇలా దళితలపై దమనకాండకు పాల్పడిన వారిని జగన్ వెనకేసుకు వస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.