కాంగ్రెస్ ను సవాల్ చేశారు. ఒప్పంద పత్రాలు చూపించాలన్నారు. అవన్నీ కాదు, అసలు ఆ ఒప్పందమే చారిత్రక తప్పిదమని కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ దాడిని ముమ్మరం చేశాయి. మహారాష్ట్రలో కుదుర్చుకున్న ఒప్పందం తెలంగాణకు వరమని తెరాస ప్రభుత్వం సంబరాలు చేసుకుంది. అది మహా ద్రోహమంటూ విపక్షాలు విరుచుకు పడుతున్నాయి. అసలు ఏది నిజమో అర్థం కాని అయోమయంలో ప్రజలున్నారు.
అది మహాద్రోహమనే మాటకు ప్రతిపక్షాలు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాయంటే ఆలోచించాల్సిన విషయమే. మల్లన్న సాగర్ విషయంలోనూ ప్రతిపక్షాలను తెరాస నేతలు తీవ్రంగా విమర్శించారు. చివరకు, ప్రతిపక్షాల వాదన పూర్తిగా అసత్యం కాదని తేలింది. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వమే దిగిరాక తప్పలేదు. జీవోను సవరించక తప్పలేదు. అంటే, ప్రతిపక్షాల వాదనలో పస లేదనే తెరాస విమర్శ తప్పు అన్నట్టే కదా.
మహా ఒప్పందం విషయంలోనూ ప్రతిపక్షాల అభ్యంతరాలకు ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వడం లేదు. అదే అనుమానానికి తావిస్తోంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తులో నిర్మించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిందని జానారెడ్డి చెప్పారు. 148 మీటర్లయితే తాము ఎప్పుడో నిర్మాణం పూర్తి చేసేవాళ్లమన్నారు.
తెరాస ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టుల్లో ఒక ఎకరా డ్రిప్ చేస్తే 60 వేల నుంచి 70 వేల వరకు ఖర్చవుతుందని, దీన్ని భరించేది రైతులో ప్రభుత్వమో చెప్పడం లేదన్నారు. జానారెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ స్పష్టమైన సమాధానం లేదు.
టీడీపీ నేతలు కూడా ప్రభుత్వంపై విమర్శల వాడి పెంచారు. లేఖాస్త్రం సంధించారు. కేసీఆర్ మాటలను ఆయనపైకే తిప్పి కొడుతున్నారు. గోదావరికి కాలు అడ్డం పెడితే నీళ్లు వస్తాయని ఉద్యమ సమయంలో కేసీఆర్ అన్నారు. ఇప్పుడు మోటార్లు పెట్టి కరెంటును దుబారా చేసే ఒప్పందం ఎలా చేసుకున్నారని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇది వేలకోట్ల ప్రజా ధనాన్ని దుబారా చేసే ఒప్పందమని బీజేపీ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. సంబరాల తర్వాత ఈ సంగ్రామంలో తెరాస డిఫెన్స్ లో పడుతుందో లేక, అనుమానాలు తీర్చడం ద్వారా పైచేయి సాధిస్తుందో చూడాలి.