తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. సోమవారం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్కోయిల్ నియోజకవర్గంలో ఆయన మెరుపు ప్రచారం నిర్వహించనున్నారు. అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎం.ఆర్. గాంధీకి మద్దతుగా పవన్ కళ్యాణ్ రోడ్ షో , బహిరంగ సభలో పాల్గొంటారు. తమిళనాడులో తెలుగు మాట్లాడే ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పవన్ను రంగంలోకి దింపడం ద్వారా గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకోవాలని ఎన్డీయే కూటమి భావిస్తోంది.
పవన్ కళ్యాణ్ పర్యటన కోసం నాగర్కోయిల్లో భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా యువత , సినిమా అభిమానుల నుంచి ఆయనకు విశేష స్పందన లభిస్తుండటంతో, భద్రతా కారణాల దృష్ట్యా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎం.ఆర్. గాంధీకి స్థానికంగా ఉన్న మంచి పేరుకు, పవన్ కళ్యాణ్ కరిష్మా తోడైతే ఫలితం సానుకూలంగా ఉంటుందని బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో సనాతన ధర్మం, అభివృద్ధి , పొరుగు రాష్ట్రాల మధ్య ఉండాల్సిన సామరస్యం గురించి మాట్లాడే అవకాశం ఉంది.
కేవలం నాగర్కోయిల్ మాత్రమే కాకుండా, హోసూరు , చెన్నై పరిసరాల్లోని మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా పవన్ ప్రచారం చేయాలని బీజేపీ అగ్రనాయకత్వం కోరినట్లు సమాచారం. ఏపీలో కూటమి విజయం సాధించడంలో పవన్ పోషించిన పాత్రను తమిళనాడులో కూడా ఉదహరిస్తూ, అక్కడ డీఎంకే విముక్త ప్రభుత్వాన్ని స్థాపించడమే లక్ష్యంగా ఆయన ప్రచారం సాగనుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక బలమైన హిందూత్వ, అభివృద్ధి కోరుకునే నేతగా పవన్ను ప్రొజెక్ట్ చేయడం ద్వారా తమిళ రాజకీయాల్లో కూడా ఆయన ముద్ర వేసేందుకు ఈ పర్యటన దోహదపడనుంది.
