ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరు కానున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో 15 నెలల తర్వాత ప్రభాకర్ రావు స్వదేశానికి చేరుకున్నారు.
గత ప్రభుత్వంలో ఎస్ఐబీ చీఫ్ గా ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రణీత్ రావు , భుజంగరావు , తిరుపతిరావులను సిట్ విచారించింది. వారంతా ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో ఈ కేసు తుదిదశకు చేరాలంటే ప్రభాకర్ రావు వస్తేనే చిక్కుముడులు వీడుతాయని ఆయన్ను హైదరాబాద్ రప్పించేందుకు సిట్ అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే నాంపల్లి కోర్టు కూడా ఆయన తప్పక విచారణకు హాజరు కావాలని ఆదేశించడం..అరెస్ట్ నుంచి సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించడంతో హైదరాబాద్ చేరుకున్నారు.
దీంతో ప్రభాకర్ రావు రేపు సిట్ విచారణకు హాజరు కానుండటం ఉత్కంఠ రేపుతోంది. గత ప్రభుత్వంలో ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు? రాజకీయ నేతలతోపాటు సినీ, జర్నలిస్టుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు? అని ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయన వీటికి సమాధానం చెబుతారా? అన్నది కీలకంగా మారింది.