తెలంగాణ విషయంలో బీజేపీ హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఊహాతీతంగా ఉంటున్నాయి. ఆ నిర్ణయాలేమీ పార్టీ గెలుపు కోసం కాకుండా.. బలోపేతం కోసం కాకుండా.. ఇతర పార్టీల కోసం అన్నట్లుగా ఉండటమే అసలు సమస్యగా మారుతోందని ఆ పార్టీ సానుభూతిపరులు గుసగుసలాడుకుంటున్నారు.
గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ దూసుకెళ్తున్న సమయంలో హఠాత్తుగా ఆయనను తప్పించి కిషన్ రెడ్డికి అవకాశం కల్పించారు. దాంతో అంతా చల్లబడిపోయింది. చివరికి ఎనిమిది సీట్లతో సర్దుబాటు చేసుకోవాల్సిన వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లారు. ఎనిమిది పార్లమెంట్ సీట్లు దక్కించుకున్నారు. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి మారుతోందన్న వాదనలకు పార్లమెంట్ ఎన్నికలు సాక్ష్యంగా మారాయి.
బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయిన చోట్ల బీజేపీ విజయం సాధించింది. ఇదే చాన్స్ గా బీఆర్ఎస్ ను బలహీనం చేయాలనుకునే ప్లాన్లు అమలు చేస్తారని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఈటల రాజేందర్ లేకపోతే ధర్మపురి అర్వింద్ లాంటి వాళ్లకు ఇస్తే పని పూర్తవుతుందని అనుకున్నారు. బండి సంజయ్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. కానీ అనూహ్యంగా రామచంద్రరావు పేరు తెరపైకి వచ్చింది.
రామచంద్రరావు అయితే బీఆర్ఎస్ పార్టీకి మంచి అవకాశమని.. మళ్లీ ఓటు బ్యాంకును వెనక్కి తెచ్చుకుని పోరాడవచ్చని పలువురు విశ్లేషిస్తున్నారు. బీజేపీ హైకమాండ్ ఇలా ఎందుకు చేస్తోందనని ఆ పార్టీ నేతలు జుట్టు పీక్కుంటున్నారు.