ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ప్రాతిపదికన ఈ కేసును మూసివేస్తూ, చంద్రబాబు నాయుడు సహా 37 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది. నిజానికి ఈ కేసులో సాక్ష్యాల్లేవని అందరికీ తెలుసు. ఒక్క రూపాయి మనీ ట్రయల్ చూపించలేకపోయారు. చివరికి టీడీపీకి వచ్చిన విరాళాల వివరాలను తీసినా వారికేమీ దొరకలేదు. ఎందుకంటే అక్కడేమీ జరగలేదు కాబట్టి. కానీ చంద్రబాబును అరెస్టు చేసి ఊరూవాడా ప్రచారం చేశారు. మరి ఇలాంటి వారిని వదిలేస్తారా?
అంతా బురద చల్లడమే – తప్పుడు ప్రచారమే !
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో రూ. 371 కోట్లు దుర్వినియోగం అయ్యాయని గత ప్రభుత్వం ఆరోపించింది. అయితే, విచారణలో ఒక్క రూపాయి కూడా దారి మళ్లినట్లు సీఐడీ పక్కా ఆధారాలు చూపలేకపోయింది. సెప్టెంబర్ 9, 2023న చంద్రబాబు నాయుడును నంద్యాలలో అరెస్టు చేసినప్పుడు, కనీసం ఎఫ్.ఐ.ఆర్ లో ఆయన పేరు కూడా లేదు. ప్రాథమిక ఆధారాలు చూపలేదు. లాయర్ గా కోర్టులో వాదనలకు.. రాజకీయ వాదనలకు తేడా తెలియని పొన్నవోలు వాదించి జైలుకు పంపారు. కానీ దర్యాప్తులో కనీస ఆధారాలు చూపించలేకపోయారు. ఇప్పుడు ఏసీబీ కోర్టు ఈ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని నిర్ధారించడంతో, ఆ 53 రోజుల జైలు శిక్షకు బాధ్యులెవరనే ప్రశ్న తలెత్తుతోంది.
తప్పుడు కేసులు పెట్టేందుకు అనేక తప్పుడు మార్గాలు
చంద్రబాబును కేసులో ఇరికించేందుకు అప్పటి విచారణాధికారులు భయంకరమైన కుట్రలు చేశారు. ప్రాజెక్టు ద్వారా శిక్షణ పొందిన వేలమంది యువకుల వివరాలను, ఆస్తుల సృష్టిని పరిగణనలోకి తీసుకోకుండా ఆడిటర్లను నియంత్రించారు. ఆడిటింగ్ నివేదికల్లోని సానుకూల అంశాలను దాచిపెట్టి, కేవలం ప్రతికూల అంశాలనే కోర్టు ముందు ఉంచడం ద్వారా వ్యవస్థను తప్పుదోవ పట్టించారు. ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని తేలడం అంటేనే, అధికారుల ఆరోపణల్లో వాస్తవం లేదని కోర్టు స్పష్టం చేసినట్లు అర్థం.
తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలేవి?
తప్పుడు కేసులు పెట్టినప్పుడు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంది. సెక్షన్ 182, 211 (IPC/BNS) కింద అధికారులపై విచారణ జరిపే అవకాశం ఉంటుంది. ఈ కేసులో కావాలని వ్యవస్థల్ని మేనేజ్ చేసి, ఉన్నతాధికారులు , రాజకీయ నేతలు కుట్ర పన్నారని రుజువైతే, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. భవిష్యత్తులో ఏ అధికారి కూడా రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలంటే, ఈ కేసులో బాధ్యులను శిక్షించడం అత్యావశ్యకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బాధితులకు న్యాయం.. వ్యవస్థలో జవాబుదారీతనం
రాజకీయ నాయకులే కాదు, ఏ అపరాధం చేయని ఐఏఎస్ అధికారులు, ఇతర సిబ్బంది కూడా ఈ కేసులో వేధింపులకు గురయ్యారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టించిన సీఐడీ అధికారులు, దర్యాప్తు సంస్థల తీరుపై ప్రభుత్వం అంతర్గత విచారణకు ఆదేశించాలన్న డిమాండ్ పెరుగుతోంది. కేవలం కేసును మూసివేయడమే కాకుండా, బాధ్యులైన వారిని కోర్టు బోనెక్కించడం ద్వారానే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కలుగుతుంది.
