ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ కేసుకు రంగం సిద్ధం అయింది. ఇప్పటికి సీఐడీ సిట్ దర్యాప్తు చేస్తున్నకేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఈడీ లేఖ రాసింది. నిందితులను విచారించడానికి విజయవాడ సీపీఅనుమతి కోరుతూ లేఖ రాసింది. ఎఫ్ఐఆర్ తో పాటు సీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్ల వివరాలు, దర్యాప్తులో తేలిన నగదు లావాదేవీల వివరాలుతో సహా మొత్తం వివరాలు అందించాలని ఈడీ కోరింది. పీఎంఎల్ఏ సెక్షన్ కింద కేసులు నమోదు చేయనున్నారు.
ఏపీలో లిక్కర్ స్కాం బహిరంగంగా జరిగిన దోపిడీ. కేవలం నగదు లావాదేవీలు చేయడం ద్వారా మొత్తం స్కాంను నడిపించారు. అధికారికంగా అమ్మిన లిక్కర్ కు తోడు.. అనధికారికంగా కూడా పెద్ద ఎత్తున అమ్మకాలు నిర్వహించి ఆ సొమ్మును జేబుల్లో వేసుకున్నారు. తయారీ, రవాణా, అమ్మకం సహా మొత్తం వైసీపీ నేతల గుప్పిట్లోనే సాగిపోయింది. దానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో అనే పేరు పెట్టారు. ఈ వ్యవహారంలో సీఐడీ సిట్ చాలా వరకూ వివరాలు సేకరించింది. వరుసగా అరెస్టులు చేస్తోంది. పలువుర్ని అరెస్టు చేశారు. సూత్రధారి వద్దకు కేసు దర్యాప్తు వెళుతోంది.
ఈ కేసులో ఈడీ దర్యాప్తు కోసం చాలా కాలంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గతంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ కేసును ఈడీకి రిఫర్ చేస్తున్నట్లుగా చెప్పారు. అవినీతి వ్యవహారంలో రాష్ట్ర సిట్ చర్యలు తీసుకుంటుంది. వేల కోట్ల మనీలాండరింగ్ ఇష్యూలో.. ఈడీ చర్యలు తీసుకుంటుంది. ఆర్థికలావాదేవీలు, అక్రమ నగదు లావాదేవీైలు, సూట్ కేసు కంపెనీల గుట్టు ఇప్పటికే బయటపడటంతో నిందితులు అంతా ఇరుక్కుపోయినట్లుగా భావిస్తున్నారు.
మరో వైపు ఈ కేసులో కీలకమైన వ్యక్తులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ తమను అరెస్టు చేయకుండా చూడాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో వారి కోసం సిట్ వెదుకుతోంది. వారు ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి ఇళ్లల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.