బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి పారిపోయినట్లుగా ఆరోపణలు ఉన్న విజయ్ మాల్యా.. చాలా కాలం తర్వాత ఆ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. నాలుగు గంటలకుపైగా సుదీర్ఘంగా సాగిన ఆ పాడ్ కాస్ట్ లో తనకు ఇండియా రావాలని ఉంది కానీ..ఇప్పటికీ తప్పు చేయకుండానే జైలుకు పంపుతాని భయంగా ఉందని చెప్పుకొచ్చారు. తాను బ్యాంకుల వద్దకు వ్యక్తిగత గ్యారంటీలు ఇచ్చి ఆరు వేల కోట్లు తీసుకున్నానని కానీ తన ఆస్తులు పధ్నాలుగు వేల కోట్లు బ్యాంకులు జమ చేసుకున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
తాను లండన్ పారిపోలేదని స్పష్టం చేశారు. వ్యాపార పనుల మీద లండన్ వెళ్తున్నట్లుగా అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కూడా చెప్పానని ఆయతే తన ఫ్లైట్ బయలుదేరగానే ఇండియాలో తాను పారిపోయానని ప్రచారం చేశారన్నారు. దాంతో ఇక తిరిగి రాలేకపోయానని తెలిపారు. తాను బ్యాంకులకు డబ్బులు కట్టలేకపోయినది నిజమే కాని దానికి తగ్గట్లుగా ఆస్తులు జప్తు చేసుకున్నారని మాల్యా వాదిస్తున్నారు. తన పతనం వెనుక రాజకీయమే ఎక్కువగా ఉందని..కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కార్యకలాపాలను తగ్గించాలనుకున్నప్పుడు .. ప్రణబ్ ముఖర్జీ అప్పులు ఇప్పించారని దాని వల్ల మరిన్ని సమస్యలు వచ్చాయన్నారు.
లండన్ లో ఉంటున్న మాల్యా ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతున్నారు. ఆయన ఆస్తులన్నీ బ్యాంకులు స్వాధీనం చేసుకున్నాయి. మిగతావి దర్యాప్తు సంస్థల వద్ద ఉన్నాయి. తాను ఇండియాకు వస్తానని .. బ్యాంకులకు చెల్లించాల్సినవి మొత్తం చెల్లిస్తానని కానీ తన ఆస్తులు రిలీజ్ చేస్తే చాలని ఆయన అంటున్నారు. అయితే విజయ్ మాల్యాను మాత్రం పారిపోయిన వ్యక్తిగా దేశం చూస్తోంది. ఆయనను డిపోర్టు చేయాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరుతోంది. కానీ న్యాయపరమైన చిక్కుల వల్ల ఆయన రాలేకపోతున్నారు.
ఒక వేళ ఆయన వచ్చినా.. కొద్దిరోజులు మాత్రమే జైల్లో ఉంటారు. తర్వాత బెయిల్ పై బయటకు వస్తారు. మిగతా విచారణలు ఎప్పటికి తేలుతాయో తెలియదు.కానీ ఆయన జైలుకే భయపడుతున్నారు.