ఎర్రబెల్లి దయాకర్ రావు తన ఓటమి ఎరుగని ప్రస్థానాన్ని బద్దలు కొట్టిన ఇద్దరు మహిళలపై వీర ప్రతాపాన్ని చూపిస్తున్నారు. మీడియాను కొనేసి..సోషల్ మీడియా సాయంతో.. తన అనుచరులతో కలిసి వారిపై వ్యతిరేక ప్రచారం చేయడంలో పూర్తి స్థాయిలో సమయం కేటాయిస్తున్నారు.
పాలకుర్తి ఎమ్మెల్యేగా యశశ్విని రెడ్డి గెలిచారు. ఆమెకు ఇరవై ఆరేళ్ల. నిజానికి అక్కడ పోటీ చేయాల్సింది ఆమె అత్త ఝాన్సీ రెడ్డి, ఆమె అమెరికా పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేసుకునే విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో కోడలితో పోటీ చేయించారు. ఎర్రబెల్లిని ఓడించారు. ఇది ఎర్రబెల్లికి ఊహించని పరాభవం. అప్పట్నుంచి ఆయన రగిలిపోతున్నారు. ఆ మహిళా నేతలు తన రాజకీయాన్ని ఎలా తట్టుకుంటారో చూస్తానన్నట్లుగా పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు.
సహజంగానే అక్కడ ఎమ్మెల్యే కన్నా.. ఆమె అత్త ఝాన్సీ రెడ్డి ఎక్కువ కార్యకలాపాలు చక్కబెడుతూంటారు. అందుకే అత్త కోడళ్ల రాజకీయం అంటూ ప్రచారం ప్రారంభించారు. వారు ఎక్కడైనా కార్యక్రమానికి వెళ్తే.. ఎర్రబెల్లి తరపున కొంత మంది మనుషులు అక్కడ రెడీగా ఉంటారు. వారిని అడ్డుకుంటారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. అడ్డుకున్న వారి మాటల్ని చూస్తే.. రాజకీయ ఉద్దేశం స్పష్టమవుతుంది. ఎక్కడా లేని రాజకీయం పాలకుర్తిలోనే జరుగుతుందని స్పష్టమవుతుంది.
ఇక మీడియా, డిజిటల్ మీడియాను ఎర్రబెల్లి గ్రిప్లో పెట్టుకున్నారు. వారిద్దరిపై వ్యతిరేక ప్రచారం చేయించడానికి రోజుకో కథనాన్ని వైరల్ చేయిస్తూంటారు. దీంతో అత్తాకోడళ్లు సహనం కోల్పోతున్నారు. ఎర్రబెల్లి కాంగ్రెస్ నేతలతోనూ సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నారు. ఎర్రబెల్లి ఇద్దరు మహిళా నేతల్ని ఎదుర్కోవడానికి రాంగ్ రూట్ రాజకీయం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కానీ ఇది శృతి మించితే ఆ మహిళా నేతలకు.. సానుభూతి వస్తుందని.. అది ఎర్రబెల్లికి మైనస్ అవుతుందని అంటున్నారు.